Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2023-06-11T21:06:01+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshmi Narasimha Swamy) సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో భక్తులు..

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshmi Narasimha Swamy) సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో భక్తులు పెద్దసంఖ్యలో క్షేత్రానికి వచ్చి ఇష్టదైవాలను దర్శించుకున్నారు. కొండకింద లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఇష్టదైవాల దర్శనాల కోసం కొండపైకి చేరుకున్నారు. భక్తుల సంచారంతో కొండపైన ఆలయ తిరువీధులు, స్వామివారి ఉభయ దర్శనాల క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామి దర్శనాలకు నాలుగు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 45వేల మందికి పైగా భక్తులు (Devotees) స్వామివారిని దర్శించుకున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. స్వామికి నిత్య పూజలు ఘనంగా కొనసాగాయు. వేకువజామున సుప్రభాతంతో నిత్యారాధనలు ఆరంభించిన ఆచార్యులు రాత్రి వేళ మహానివేదన, శయనోత్సవ పర్వాలతో ఆలయ ద్వారబంధనం జరిపారు.

గర్భాలయంలోని స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్య పూజలు, నిత్య రుద్రహవనం, కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. దివ్యాంగులు, వృద్ధులను ఆలయ తిరువీధుల్లో తిప్పేందుకు ప్రధానాలయానికి ఎస్‌బీఐ బహూకరించిన బ్యాటరీ కార్ల సేవలను పలువురు భక్తులు వినియోగించుకున్నారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.57,94,991 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2023-06-11T21:06:01+05:30 IST