Yadagirigutta: యాదగిరిక్షేత్రంలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2023-04-30T21:00:20+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.

Yadagirigutta: యాదగిరిక్షేత్రంలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో క్షేత్ర సందర్శనకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు (Devotees) హరిహరుల నామస్మరణల నడుమ యాదగిరికొండంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కొండకింద లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఇష్టదైవాల దర్శనాల కోసం కొండపైకి చేరుకున్నారు. భక్తుల రాకతో కొండపైన ఆలయ తిరువీధులు, స్వామివారి ఉభయ దర్శనాల క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ధర్మదర్శనాలకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు సుమారు రెండు గంటల సమయం పట్టిందని, సుమారు 35వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కొండపైన ప్రొటోకాల్‌ కార్యాలయం ముందు వీఐపీ దర్శనాలకు వెళ్లే దారిలో వర్షపు నీరు నిలవడంతో భక్తులు నడిచి వెళ్లేందుకు ఇబ్బందులుపడ్డారు.

స్వామికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు

యాదగిరీశుడికి నిత్యపూజలు ఘనంగా జరిగాయి. వేకువజామున సుప్రభాతంతో నిత్యారాధనలు ఆరంభించి రాత్రివేళ మహానివేదన, శయనోత్సవాలతో ఆలయ ద్వారబంధనం జరిపారు. గర్భాలయంలోని స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యపూజలు, నిత్య రుద్రహవనం, కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.44,12,760 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2023-04-30T21:00:20+05:30 IST