Operation kaveri: సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వారిపై బీఆర్‌ఎస్ సర్కార్ దృష్టి

ABN , First Publish Date - 2023-04-26T13:07:14+05:30 IST

సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వారిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది.

Operation kaveri: సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వారిపై బీఆర్‌ఎస్ సర్కార్ దృష్టి

న్యూఢిల్లీ: సూడాన్‌లో సైన్యానికి, పారా మిలిటరీ దళాలకు జరుగుతున్న అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ (Operation Kaveri) పేరుతో సహాయక చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సూడాన్ నుంచి పౌరులను తరలించేందుకు ఆపరేషన్ కావేరి ముమ్మరంగా సాగుతోంది. అందులో భాగంగా సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వారిపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) దృష్టి సారించింది. ఆపరేషన్ కావేరిలో భాగంగా భారత్ తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ ప్రజలు ఉంటే వారికి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రజలను స్వరాష్ట్రాలకు తరలించేందుకు బీఆర్ఎస్‌ సర్కార్ చర్యలు చేపట్టింది. ఢిల్లీలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో అధికారులతో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ (Telangana Resident Commissioner Gaurav Uppal) సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. సూడాన్ పరిస్థితులపై విదేశీ వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు బ్రీఫింగ్ ఇచ్చిందన్నారు. సూడాన్ నుంచి భారత పౌరులను తీసుకు వచ్చేందుకు ఆపరేషన్ కావేరి ప్రారంభించారని తెలిపారు. సూడాన్‌లో ఉన్న తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. ఢిల్లీలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని... విదేశీ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఢిల్లీకి చేరుకునే తెలంగాణ పౌరులను రిసీవ్ చేసుకొని, వాళ్ళకు ఢిల్లీలో ఏర్పాట్లు చేస్తామన్నారు. వారిని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. సూడాన్ నుంచి తెలంగాణకు చెందిన నలుగురు వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. మొత్తం సూడాన్‌లో ఎంత మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారనేది ఇంకా విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదని గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు.

278 మంది స్వదేశానికి...

సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను (Indians) తీసుకొచ్చేందుకు కేంద్రం (Central Government) చేపట్టిన ‘ఆపరేషన్‌ కావేరీ’లో భాగంగా తొలి విడతలో 278 మంది స్వదేశానికి బయల్దేరారు. సూడాన్‌ పోర్టులో (Sudan Port) ప్రస్తుతం 500 మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఐఎన్‌ఎస్‌ సుమేధలో మంగళవారం (ఏప్రిల్ 25, 2023) 278 మంది భారతీయులు బయల్దేరారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్విటర్‌లో పేర్కొన్నారు. సూడాన్‌లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి నీమా సయీద్‌ అబిద్‌ పేర్కొన్నారు. సూడాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో భాగంగా తిరుగుబాటుదారులు రాజధానిలోని ప్రభుత్వ జాతీయ ల్యాబొరేటరీని ఆక్రమించారని తెలిపారు. పోలియో, తట్టు వంటి పలు వ్యాధులకు సంబంధించిన నమూనాలను ఈ ల్యాబ్‌లో భద్రపరుస్తారు. ఈ ల్యాబ్‌ను ఆక్రమించుకొన్న ఫైటర్లు అక్కడి టెక్నీషియన్లందరినీ తరిమేశారని.. సైనిక స్థావరంగా వాడుకుంటున్నారని సయీద్‌ తెలిపారు. దీన్ని అతిపెద్ద జీవ (బయోలాజికల్‌) ముప్పుగా అభివర్ణించారు.

Updated Date - 2023-04-26T13:16:56+05:30 IST