Revanth Reddy: నిజామాబాద్ సాక్షిగా మోదీ-కేసీఆర్ బంధం బయటపడింది

ABN , First Publish Date - 2023-10-04T14:34:13+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు.

Revanth Reddy: నిజామాబాద్ సాక్షిగా మోదీ-కేసీఆర్ బంధం బయటపడింది

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్-బీజేపీ ఫెవికాల్ బంధం గురించి నిజామాబాద్ సాక్షిగా మోదీ (pm modi) బయటపెట్టారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకే మోదీ పర్యటనలు. పదేళ్లలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ అపహాస్యం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోదీ చెప్పాల్సింది. బీఆర్ఎస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఈడీ, సీబీఐ , ఐటీ విచారణ చేయడం లేదు. బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయి. అందుకే కేసీఆర్‌పై మోదీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ నిజాన్ని నిజామాబాద్ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారు.’’ అని చెప్పుకొచ్చారు.

ఎంఐఎం పునరాలోచించాలి..

‘‘బీఆర్ఎస్‌కు (BRS) మద్దతుపై ఎంఐఎం (MIM) పునరాలోచించుకోవాలి. బీజేపీ (BJP), బీఆర్ఎస్ ఒక్కటే... అవిభక్త కవలలు. మోదీ, కేసీఆర్‌ది (CM KCR) ఫెవికాల్ బంధం. వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. అలాంటి వారికి అసద్ ఎలా మద్దతు ఇస్తారు. ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆర్ఎస్‌తోనా?, బీజేపీ, బీఆర్ఎస్‌ను ఓడించాలంటున్న కాంగ్రెస్ తోనా?.’’ తేల్చుకోవాలని రేవంత్ సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

‘‘నిధులు అంటే దోపిడీ సొమ్ము ... నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయి. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోదీని ఆయన దర్బారులో సన్మానం చేశారు. ఇదంతా కనిపించే ఒకవైపు మాత్రమే. మరి ఎన్నికల కోసం పంపిన వేల కోట్ల సంగతి ఏంటి?, బీఆర్ఎస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ అధిష్టానం నరేంద్రమోదీ అని స్పష్టత వచ్చింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ ఎంపీలే నాకు చెప్పారు. బీఆర్ఎస్-9, బీజేపీ-7, ఎంఐఎం-1 చొప్పున పంపకాలు చేసుకున్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు. వాళ్లిద్దరూ కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు. మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలి.’’ అని రేవంత్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-04T14:34:13+05:30 IST