TSRTC: ప్రయాణికులకు ప్రత్యేక ఆఫ‌ర్లు ప్రకటించిన ఆర్టీసీ

ABN , First Publish Date - 2023-03-09T16:09:14+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ (Hyderabad)లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు స్పెషల్‌ ఆఫర్లను (Special offers) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)

TSRTC: ప్రయాణికులకు ప్రత్యేక ఆఫ‌ర్లు ప్రకటించిన ఆర్టీసీ
తక్కువ ఖర్చుతో రోజంతా...

గ్రేటర్‌ హైదరాబాద్‌లో అందుబాటులోకి టి-6, ఎఫ్‌-24 టికెట్లు

మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం 'టి-6' టికెట్‌

రూ.50 చెల్లిస్తే ఆరు గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం

కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం 'ఎఫ్‌-24' టికెట్‌

రూ.300 చెల్లిస్తే రోజంతా నలుగురు ప్రయాణించే వెసులుబాటు

రేపటి నుంచి అందుబాటులోకి టికెట్లు

పోస్టర్లను ఆవిష్కరించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్

గ్రేటర్‌ హైదరాబాద్‌ (Hyderabad)లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు స్పెషల్‌ ఆఫర్లను (Special offers) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి-24 టికెట్‌ను ఇప్పటికే అందజేస్తోన్న సంస్థ.. తాజాగా టి-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో గురువారం టి-6, ఫ్యామిలీ-24 టికెట్ల పోస్టర్లను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (MD VC Sajjanar) ఆవిష్కరించారు. ఈ టికెట్లు శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

tsrc.jpg

మహిళలు, సీనియర్‌ సిటిజన్ల సౌకర్యార్థం టి-6 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని రూ.50 చెల్లించి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సిటి ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఆరు గంటల పాటు వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే టి-6 టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ టికెట్‌ను బస్సుల్లో కండక్టర్‌లు ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టి-6 టికెట్లను మంజూరు చేయరు. 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు టి-6 టికెట్‌ వర్తిస్తుంది. టికెట్‌ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం వారు ఆధార్‌ కార్డు చూపించాల్సి ఉంటుంది.

వారంతాలు, సెలువు దినాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా ఫ్యామిలీ-24 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్‌కు రూ.300 చెల్లిస్తే.. నలుగురు రోజంతా సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం కాగా.. అంతకు పైబడిన వారు ఫ్యామిలీ-24 టికెట్‌ తీసుకోవచ్చు. శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తిరిగే బస్సుల్లో టి-24 టికెట్‌ను సంస్థ అందజేస్తోంది. 24 గంటల పాటు ఆ టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. ఆ టికెట్‌ ధర పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.60గా ఉంది.

ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: కవిత లిక్కర్ స్కామ్ చేస్తే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం?

"గ్రేటర్‌ హైదరాబాద్‌లో తీసుకువచ్చిన టి-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. వారిలో 55.50 లక్షల మంది టీ-24 టికెట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రతి రోజు సగటున 25 వేల వరకు ఆ టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రయాణికులకు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు టి-6, ఫ్యామిలీ-24 టికెట్లను టీఎస్‌ఆర్టీసీ (TSRTC) యాజమాన్యం ప్రకటించింది. మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ టికెట్లను వినియోగించుకోవాలి. టి-24 టికెట్‌ అయితే.. నలుగురు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ-24తో ముగ్గురికి రూ.300 చెల్లించి నలుగురు ప్రయాణం చేయవచ్చు." అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు.

టి-24 టికెట్‌ మాదిరిగానే వాటిని ఆదరించాలని ప్రజలను సజ్జనర్‌ కోరారు. ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసమే టి-6, ఫ్యామిలీ-24 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ఈ టికెట్ల ద్వారా తక్కువ చార్జీలతోనే హైదరాబాద్‌ నగరంలో ప్రయాణించవచ్చని గుర్తు చేశారు. టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లు పీవీ ముని శేఖర్, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, సీపీఎం కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్ర‌సాద్‌, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్‌, సీటీఎం (ఎం అండ్‌ సీ) విజయ్‌ కుమార్‌, సీఎఫ్‌ఎం విజయ పుష్ఫ, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఆర్‌ఎంలు వరప్రసాద్‌, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bangalore: ర్యాపిడో బైక్‌ డ్రైవర్‌ హెల్మెట్‌ లాక్కుని.. నేలకేసి కొట్టి.. ఓ ఆటో డ్రైవర్ వార్నింగ్.. వేరే దేశం నుంచి వచ్చి మరీ మా పొట్ట కొడుతున్నారంటూ..

Updated Date - 2023-03-09T16:09:14+05:30 IST