CM KCR: మళ్ళీ వస్తా... అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టు

ABN , First Publish Date - 2023-02-15T15:12:23+05:30 IST

దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

CM KCR: మళ్ళీ వస్తా... అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టు

జగిత్యాల: దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు (Kondagattu Temple) అనే పేరు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. బుధవారం కొండగట్టుకు వచ్చిన సీఎం కేసీఆర్(Telangana CM).. ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆపై కొండగట్టు అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ (KCR) మాట్లాడుతూ.. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టు (Kondagattu)ను తీర్చిదిద్దాలన్నారు. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు తెలిపారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలని చెప్పారు. దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలని అభిప్రాయపడ్డారు. 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేయాలన్నారు. పెద్దవాల్, పార్కింగ్, పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరును అభివృద్ధి చేయాలన్నారు. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలియజేశారు. మళ్ళీ వస్తానని... ఆలయ అభివృద్ధి, విస్తరణపై మరోసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS Chief)పేర్కొన్నారు.

కాగా... ఈరోజు ఉదయం కొండగట్టుకు చేరుకున్న కేసీఆర్‌ (BRS) కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి (Indrakaran Reddy), గంగుల కమలాకర్ (Gangula Kamalakar), కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) కూడా సీఎంకు స్వాగతం తెలిపారు. అంజన్న దర్శనం తర్వాత అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు గంటల పాటు ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు. సీఎం రాక సందర్భంగా ఆలయం వద్ద పోలీసులు (Police) భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత (MLC Kavita)గైర్హాజరయ్యారు.

అంజన్న దర్శనం తర్వాత కొండగట్టు అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిధిలో ఎంత భూమి ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 350 ఎకరాల భూమి ఉందని అధికారులు చెప్పారు. ఆలయ ప్రాకారాలు, పుష్కరిణి, ప్రధాన ఆలయ అభివృద్ధి, కల్యాణ కట్ట, మాల విరమణకు ప్రత్యేక సదూపాయాలు కల్పించాలని.. ఆలయ అభివృద్ధికి వంద కోట్లే కాదు ఎన్ని నిధిలైనా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అధికారులతో సమీక్ష ముగిసిన అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌ (Hyderabad)కు తిరుగుపయనమయ్యారు.

Updated Date - 2023-02-15T15:12:30+05:30 IST