TS News: ఆ ముగ్గురు విద్యార్థులు సరదాగా ఈతకెళ్లారు... అంతలోనే

ABN , First Publish Date - 2023-04-14T15:09:26+05:30 IST

ఈత సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది.

TS News: ఆ ముగ్గురు విద్యార్థులు సరదాగా ఈతకెళ్లారు... అంతలోనే

పెద్దపల్లి: ఈత సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ న్యూ పోరేటిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పోరేట్‌పల్లికి చెందిన ముగ్గురు స్నేహితులు చెరువులో ఈతకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు పోరేటిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నారని స్థానికులు వెల్లడించారు. మృతులు సాయి చరణ్, ఉమా మహేష్, విక్రమ్‌గా గుర్తించారు. అయితే సాయిచరణ్, ఉమా మహేష్ చెరువులోనే చనిపోగా.. విక్రమ్ మాత్రం చెరువు నుంచి బయటకు తీసిన కాసేపటికి ప్రాణాలు విడిచారు. దీంతో సరదాగా ఈతకెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానికులు... ముగ్గురు విద్యార్థులను చెరువులో నుంచి బయటకు తీసి గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటే వారు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. దీంతో గోదావరిఖని ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముగ్గురికి కూడా సరిగా ఈతరాకపోవడం వల్లే ఒకరి తరువాత ఒకరు చెరువులో మునిగిపోయారని తెలుస్తోంది. కాసేపటి క్రితమే ప్రభుత్వాస్పత్రిలో ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యింది. దీంతో మృతదేహాలను కుటుంబసభ్యులు స్వగ్రామానికి తరలించారు.

Updated Date - 2023-04-14T15:09:26+05:30 IST