Etala Rajender: బీజేపీ అధికారంలోకి వస్తే 55 ఏళ్లకే పెన్షన్

ABN , First Publish Date - 2023-09-09T19:22:21+05:30 IST

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే 55 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేస్తామని బీజేపీ నేత ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు.

Etala Rajender: బీజేపీ అధికారంలోకి వస్తే 55 ఏళ్లకే పెన్షన్

ఖమ్మం: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే 55 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేస్తామని బీజేపీ నేత ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. శనివారం నాడు వైరా పట్టణంలో బీజేపీ బూత్‌లెవల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించిన ఈటెల రాజేందర్, గరికపాటి మోహనరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈటల రాజెందర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయటంలో విఫలం అయ్యారు. ప్రభుత్వ భూములు అమ్మి ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బాఆర్ఎస్ పార్టీలో ఎన్నికైన ఎమ్మెల్యేలను పావుల వాడుకుంటున్నాడు. వారి అధికారాలను సైతం తన వద్దే గుప్పిట్లో పెట్టుకుంటాడు.గిరిజన ఎమ్మెల్యేగా ఉన్న రాముల నాయక్ పదవి దిగిపోక ముందే తన అధికారాలకు కత్తెర వేశాడు.సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌ను పక్కన పెట్టి మదన్ లాల్‌కు వైరా టికెట్ ఇచ్చాడు. దళిత బంధు, బీసీ బందు పథకాలను అమలు చేయకుండా అడ్డుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికార దాహంతో పనిచేస్తున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను మోసం చేశారు.

బీఆర్ఎస్ నాయకులు కమీషన్ల కోసం మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. రైతులకు ఫసల్ భీమా యోజన పథకం వర్తించకుండా కేసీఆర్ రైతులను మోసం చేశాడు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల నష్టపరిహారం ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వ భూములు అమ్మి పథకాలకు కేటాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుంది. కేంద్రంలో మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతాం’’ అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

Updated Date - 2023-09-09T19:23:42+05:30 IST