Yadadri: యాదాద్రిలో చిరుధాన్యాల లడ్డూ ప్రసాదం

ABN , First Publish Date - 2023-06-17T21:51:43+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేసేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సర్క్యూలర్‌ను జారీ చేసింది.

Yadadri: యాదాద్రిలో చిరుధాన్యాల లడ్డూ ప్రసాదం

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేసేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సర్క్యూలర్‌ను జారీ చేసింది. ఈ క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసిన దేవాదాయశాఖ రాష్ట్రంలోని యాదగిరిక్షేత్రం, భద్రాచలం, వేములవాడ తదితర దేవాలయాలకు చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలను తయారు చేసేందుకు ఆదేశాలు జారీచేసింది. చిరుధాన్యాలైన అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలతో బెల్లం లడ్డూలను తయారు చేసేందుకు మార్గదర్శకాలు జారీచేశారు. దీంతో ఆయా దేవాలయాల్లో వంట స్వాములు చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలను వివిధ సైజుల్లో గత నెలలో తయారు చేసి నమూనాలను దేవాదాయశాఖకు పంపించారు. దేవాదాయశాఖ అధికారులు వివిధ దేవాయాల్లో తయారు చేసిన చిరుధాన్యపు లడ్డూలను అదే నెలలో నిపుణుల కమిటీకి పరిశీలనకు పంపారు. నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలను తయారుచేసి విక్రయించేందుకు అధికారులు నిర్ణయించారు.

80గ్రాముల చిరుధాన్యం లడ్డూ ధర రూ.40

అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలు చిరు ధాన్యాలతో సుమారు 80గ్రాముల బెల్లం లడ్డూలను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో లడ్డూ ధరను రూ.40గా అధికారులు నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీ నుంచి స్వామివారి ప్రసాదాల తయారీ వంటశాలలో శ్రీవైష్ణవ, బ్రాహ్మణ వంటస్వాములతో తయారుచేయించి విక్రయానికి అందుబాటులోనికి తీసుకురానున్నారు.

Updated Date - 2023-06-17T21:51:43+05:30 IST