TS News: తెల్లారితే పెళ్లి.. వరుడిని కబళించిన మృత్యువు

ABN , First Publish Date - 2023-05-11T20:41:11+05:30 IST

ఆ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. తెల్లవారితే వివాహం... ఇంతలోనే వరుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్‌ జిల్లా కొమ్ముగూడెం..

TS News: తెల్లారితే పెళ్లి.. వరుడిని కబళించిన మృత్యువు

మహబూబాబాద్‌: ఆ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. తెల్లవారితే వివాహం... ఇంతలోనే వరుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్‌ జిల్లా కొమ్ముగూడెం తండాలో గురువారం చోటు చేసుకుంది. మహబూబాబాద్‌ (Mahabubabad) మండలంలోని కొమ్ముగూడెంకు చెందిన భూక్య బాలాజీ-కాంతి దంపతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహం జరిగింది. చిన్నవాడైన భూక్య యాకూబ్‌(22) హైదరాబాద్‌ (Hyderabad)లో రైల్వే కోచ్‌ డబ్బాలకు పెయింటింగ్‌ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు.

రెండు నెలల కిందట యాకూబ్‌కు ఇదే జిల్లా గార్ల మండలంలోని ఓ తండాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 12న తెల్లవారుజామున 2.25 గంటలకు వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. వారి వారి ఇళ్లలో పెళ్లి వేడుక పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో నీరు లేకపోవడంతో వరుడు యాకూబ్‌ ఇంట్లో ఉన్న బోరు మోటారును ఆన్‌ చేసే క్రమంలో విద్యుదాఘాతంకు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మహబూబాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యాకూబ్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తెల్లారితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన యాకూబ్‌ విద్యుదాఘాతంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. విగత జీవిగా పడివున్న కుమారుడు యాకూబ్‌ను చూసి తల్లిదండ్రులు బోరున విలపించడంతో గ్రామస్థులంతా కంటతడి పెట్టారు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2023-05-11T20:42:56+05:30 IST