Falaknuma Train Accident: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఘటన ప్రమాదమా?.. కుట్ర కోణమా?.. రైల్వే అధికారులు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-07-07T14:23:23+05:30 IST

యాదాద్రి వద్ద హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద రైలు బోగీల్లో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా?.. లేక ఏదన్నా కుట్రకోణం దాగుందా అని అనుమానిస్తే.. ఇది ఖచ్చితంగా కుట్రకోణమే అని రైల్వే అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు.

Falaknuma Train Accident: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఘటన ప్రమాదమా?.. కుట్ర కోణమా?.. రైల్వే అధికారులు ఏమన్నారంటే..

యాదాద్రి: యాదాద్రి వద్ద హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో (Falaknuma Train Accident ) మంటలు చెలరేగాయి. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద రైలు బోగీల్లో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా?.. లేక ఏదన్నా కుట్రకోణం దాగుందా అని అనుమానిస్తే.. ఇది ఖచ్చితంగా కుట్రకోణమే అని రైల్వే అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదం గురించి అధికారులను ముందుగానే ఓ అజ్ఞాతవ్యక్తి హెచ్చరించాడు. ఈరోజు రైలు ప్రమాదం జరుగుతుందని నిన్న (గురువారం) దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఓ ఆకాశరామన్న లేఖ అందించింది. ఇప్పుడు ప్రమాదం జరిగిన తీరుతెన్నులను పరిశీలించిన అధికారులు ఇది ప్రమాదం కాదని, ఖచ్చితంగా కుట్ర కోణమని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం ఆరు బోగీలు దగ్ధమయ్యాయి. ఎస్-4, ఎస్-5, ఎస్-6, ఎస్-7 బోగీలు కాలి బూడిదయ్యాయి. బోగీల్లో పొగ గమనించగానే లోకో పైలెట్ ట్రైన్‌ను నిలిపివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులంతా రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. అగ్నిప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి విడదీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మరోవైపు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను మళ్లించారు. రామన్నపేట రైల్వే స్టేషన్లో శబరి, నడికుడిలో రేపల్లె సికింద్రాబాద్ రైళ్లను నిలిపివేశారు. జన్మభూమి, నర్సాపుర్ రైళ్లు విజయవాడ మీదుగా మళ్ళించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ట్రాక్ క్లియరెన్స్ కోసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

అంతా క్షేమం: సౌత్ సెంట్రల్ రైల్వే

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని సౌత్‌ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. ప్రయాణికులు ఎవరు ఆందోళన చెందొద్దని పేర్కొంది. అందరిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని.. షార్ట్ సర్క్యూట్‌గా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.

Updated Date - 2023-07-07T14:29:54+05:30 IST