Preeti Case: రెండో రోజు సైఫ్‌ను విచారిస్తున్న పోలీసులు

ABN , First Publish Date - 2023-03-03T12:03:49+05:30 IST

డాక్టర్ ప్రీతి మృతి కేసులో సైఫ్‌ను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు.

Preeti Case: రెండో రోజు సైఫ్‌ను విచారిస్తున్న పోలీసులు

వరంగల్: డాక్టర్ ప్రీతి మృతి కేసు (Doctor Preeti Case)లో సైఫ్‌ (Saif)ను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో నిన్న సైఫ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఖమ్మం జైలు నుంచి వరంగల్‌కు తీసుకువచ్చిన పోలీసులు మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు. ప్రీతితో ఉన్న గొడవలు, ఆమెను వేధింపులకు గురి చేయడానికి గల కారణాలను, చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు, టెక్నికల్ ఎవిడెన్స్‌పై సైఫ్‌ను విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు సైఫ్‌ను పోలీసులు విచారించనున్నారు.

మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్య ఉదంతంలో కాకతీయ వైద్య కళాశాల, ఎంజీఎం ఆస్పత్రి అనస్తిషియా విభాగం అధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి (Professor Dr. Nagarjuna Reddy)పై ప్రభుత్వం (Telangana Government) బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. నాగార్జునరెడ్డిని భూపాలపల్లి ప్రభుత్వ వైద్యకళాశాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు పీజీ విద్యార్థుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో విభాగం అధిపతి డాక్టర్‌ కె.నాగార్జునరెడ్డి ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల మధ్య సమన్వయాన్ని చేకూర్చాల్సిన హెచ్‌వోడీ ఆ విషయాలు పట్టించుకోకపోవడం కూడా డాక్టర్‌ ప్రీతి (Doctor Preeti) ఆత్మహత్యకు ఉసిగొల్పాయి. ప్రధానంగా డాక్టర్‌ ప్రీతి ఫిర్యాదుపై సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదనీ ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు సమాచారం.

కాగా... ఈ కేసుకు సంబంధించి ప్రీతి కుటుంబసభ్యులు కీలకమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రీతి సోదరుడు పృథ్వి ఏబీఎన్‌తో మాట్లాడుతూ... ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు లేవన్నారు. మా అక్క ప్రీతి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తాము ఆరోపణలు చేస్తున్న ఏసీపీనే విచారణ అధికారిగా ఉన్నారని... ర్యాగింగ్ కమిటీలోనూ ఏసీపీ తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని మండిపడ్డారు. కౌన్సిలింగ్ ఇచ్చామంటున్నారు కానీ, మా అక్క చెప్పలేదని పృథ్వీ తెలిపారు.

Updated Date - 2023-03-03T12:03:49+05:30 IST