Farmers: పంటను దున్నేసిన రైతులు
ABN , Publish Date - Aug 27 , 2024 | 12:45 AM
సాగునీటి వనరుల కింద సాగుచేసిన పంటలు భారీ వర్షాలకు కుళ్లిపోయాయి. దీంతో రైతులు పంటను తొలగించి.. మరోసారి విత్తనం వేస్తున్నారు. గుంతకల్లు బ్రాంచ కాలువ, హెచఎల్సీ, బోరు బావుల కింద ఉరవకొండ నియోజక వర్గ పరిధిలో జూలైలో వేల ఎకరాల్లో మిరప, కంది, మొక్కజొన్న పంటలను సాగు చేశారు. ఇటీవల వారం రోజులు ఎడతెరిపి ...
నెల వ్యవధిలో రెండో విత్తనం
కంది రైతులదీ అదే పరిస్థితి
విడపనకల్లు, ఆగస్టు 26: సాగునీటి వనరుల కింద సాగుచేసిన పంటలు భారీ వర్షాలకు కుళ్లిపోయాయి. దీంతో రైతులు పంటను తొలగించి.. మరోసారి విత్తనం వేస్తున్నారు. గుంతకల్లు బ్రాంచ కాలువ, హెచఎల్సీ, బోరు బావుల కింద ఉరవకొండ నియోజక వర్గ పరిధిలో జూలైలో వేల ఎకరాల్లో మిరప, కంది, మొక్కజొన్న పంటలను సాగు చేశారు. ఇటీవల వారం రోజులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురువటంతో పొలాల్లో తేమ ఎక్కువైంది. వేరుకుళ్లు ఆశించడంతో మొక్కలు కుళ్లిపోయాయి. దీంతో గత్యంతరం లేక పంటను తొలగిస్తున్నారు. విడపనకల్లు మండలంలో వందల ఎకరాల్లో మిరప మొక్కలను ట్రాక్టర్లు, ఎద్దుల గుంటకలతో దున్నించారు. తేమ ఆరిపోతుందని మరుసటి రోజే నుంచే తిరిగి మిరప విత్తనం వేస్తున్నారు.
భారీగా నష్టం
జూలైలో మిరప సాగు చేస్తే దిగుబడి బాగా ఉంటుంది. తాజాగా పంటను తొలగించడంతో ఈసారి దిగుబడి నెల ఆలస్యంగా వస్తుంది. దీంతోపాటు దిగుబడి భారీగా తగ్గుతుంది. మిరస సాగుకు ఎకరానికి రూ.25 వేలు ఖర్చు చేశారు. రెండోసారి సాగుకు ఎకరానికి రూ.10 వేల దాకా వస్తుందని రైతులు అంటున్నారు. పంట కుళ్లిపోవడంతో ఒక్కొక్క రైతు రూ.లక్ష నుంచి రూ.1.5లక్షల వరకూ పెట్టుబడి నష్టపోయారు. వర్షాల కారణంగా పంట పొలాల్లో కలుపు విపరీతంగా పెరిగింది. తొలగించడానికి సాధ్యం కాదని తెలిసి.. పంటను దున్నేస్తున్నారు.
వేలాది ఎకరాలు..
గడిచిన నాలుగు రోజుల్లో జీబీసీ కింద విడపనకల్లు, ఆర్ కొట్టాల, హావళిగి, డొనేకల్లు, గడేకల్లు, జనార్దనపల్లి, పొలికి, వజ్రకరూరు మండలంలో హంద్రీనీవా ఆయకట్టు రైతులు, ఉరవకొండ మండలంలోని వివిధ గ్రామాల రైతులు వేల ఎకరాల్లో మిరప పంటను దున్నేశారు. రెండోసారి మిరప నారు సాగు చేశారు. కొందరు రైతులు మిరప విత్తనాన్ని విత్తితే, మరికొందరు నర్సరీల్లో నారు కొని తెచ్చి నాటు వేస్తున్నారు.
దెబ్బతిన్న కంది
భారీ వర్షాలకు కంది పైరు పూర్తిగా దెబ్బతినింది. మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి. ఆర్.కొట్టాల గ్రామానికి చెందిన పవన కుమార్ 20 ఎకరాల్లో సాగు చేసిన కంది పైరు పూర్తిగా పసుపు రంగులోకి మారింది. దీంతో తేమ ఆరిన అనంతరం పైరును తొలగించి జొన్న లేదా పప్పుశనగ సాగు చేస్తానని బాధిత రైతు తెలిపారు. వజ్రకరూరు మండలంలోని కొనకొండ్ల, వజ్రకరూరు, రాగలపాడు తదితర గ్రామాల పరిధిలోనూ కంది పైరు తేమ ఎక్కువై కుళ్లిపోయింది.
పది ఎకరాల్లో కుళ్లిపోయింది..
జూలైలో పది ఎకరాల్లో మిరప సాగు చేశాను. మొలకెత్తిన రోజు నుంచి ఒకటే వర్షం. పంట మొత్తం కుళ్లిపోయింది. చేసేది లేక ట్రాక్టర్తో దున్నేశాను. మళ్లీ మిరప పంటనే సాగు చేస్తున్నాను. వేరే పంటలు వేసినా అంతగా లాభం ఉండదు. లాభమో.. నష్టమో.. మిరపనే నమ్ముకుంటున్నాను. ఇప్పటికే రూ.2 లక్షలు నష్టం వచ్చింది.
- పురుషోత్తం, ఆర్ కొట్టాల
పూర్తిగా కుళ్లిపోయింది..
అధిక వర్షాలకు మిరప మొక్కలు పూర్తిగా కుళ్లిపోయాయి. అధిక తేమకు వేరు కుళ్లు తెగుళ్లు సోకటంతో 5 ఎకరాల్లో పంట దెబ్బతిని లక్షల్లో నష్ట పోయాను. మిరప పంటతో ప్రతి ఏటా నష్టపోతున్నాం.
- మద్దిపాట్ల శ్రీనివాసులు, ఆర్.కొట్టాల
కౌలుకు తీసుకుని..
ఏడు ఎకరాలను కౌలుకు తీసుకుని జూలైలో మిరప విత్తనం వేశాను. వారం రోజులపాటు కురిసిన వర్షాలకు మొత్తం పంటంతా కుళ్లిపోయింది. గడ్డి కూడా విపరీతంగా పెరిగింది. దిక్కుతోచక కాడెద్దులతో దున్నేశాను. మళ్లీ మిరప పంటనే సాగు చేశాను. ఇప్పటి వరకూ ఎకరానికి రూ.30 వేలు ఖర్చు అయింది.
- కె.హరికృష్ణ, ఆర్ కొట్టాల
ఒక్క మొక్కా మిగల్లేదు..
ఐదు ఎకరాల్లో మిరప సాగు చేస్తే ఒక్క మొక్క కూడా మిగల్లేదు. చిన్న పైరు కావటంతో వర్షపు నీరు నిలిచి కుళ్లిపోయింది. వాటిని కాపాగడు కోవటం కంటే దున్నేయడం మంచిది. అందుకే దున్నేసి మరోసారి మిరపనే సాగు చేశాను. గత ఏడాది చివరిలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ సారి మొదట్లోనే నష్టపోయాం.
- భోగేశ్వరాచారి, ఆర్ కొట్టాల
మరిన్ని అనంతపురం వార్తల కోసం....