Share News

Censor : వామ్మో.. సెన్సర్‌

ABN , Publish Date - Sep 25 , 2024 | 11:54 PM

డ్రైవింగ్‌ లైసెన్స కోసం వెళ్లే వారికి సెన్సర్‌ కష్టాలు తీరడం లేదు. ఈక్రమంలోనే చాలా మంది డ్రైవింగ్‌ పరీక్షలో ఫెయిల్‌ అవుతున్నారు. 2022 నుంచి అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవింగ్‌ పరీక్షల్లో సెన్సర్‌ సేవలు మొదలయ్యాయి. ఆటోమేటిక్‌ ట్రాక్‌పై వాహనం ఎలా నడపాలో అవగాహన లేక ఎక్కువ శాతం మంది వాహనదారులు ఫెయిల్‌ అవుతున్నారన్న అభిప్రాయాలున్నాయి. డ్రైవింగ్‌ పరీక్షకు ముందుగా ఆటోమెటిక్‌ ...

 Censor : వామ్మో.. సెన్సర్‌
A crew installing a camera in a vehicle

డ్రైవింగ్‌ లైసెన్సకు చుక్కలు

వాహనదారుల బెంబేలు

ఆటోమేటిక్‌ ట్రాక్‌పై నడిపేందుకు ఇబ్బందులు

ఇప్పటికీ తగ్గని ఫెయిల్యూర్‌ శాతం

టెస్ట్‌ డ్రైవ్‌కు అవకాశం కోరుతున్న వాహనదారులు

అనంతపురం అర్బన, సెప్టెంబరు 25: డ్రైవింగ్‌ లైసెన్స కోసం వెళ్లే వారికి సెన్సర్‌ కష్టాలు తీరడం లేదు. ఈక్రమంలోనే చాలా మంది డ్రైవింగ్‌ పరీక్షలో ఫెయిల్‌ అవుతున్నారు. 2022 నుంచి అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవింగ్‌ పరీక్షల్లో సెన్సర్‌ సేవలు మొదలయ్యాయి. ఆటోమేటిక్‌ ట్రాక్‌పై వాహనం ఎలా నడపాలో అవగాహన లేక ఎక్కువ శాతం మంది వాహనదారులు ఫెయిల్‌ అవుతున్నారన్న అభిప్రాయాలున్నాయి. డ్రైవింగ్‌ పరీక్షకు ముందుగా ఆటోమెటిక్‌ ట్రాక్‌పై వాహనం ఎలా నడపాలో స్ర్కీన ద్వారా తెలియజేస్తున్నా ఎక్కువ శాతం మంది ఫెయిల్‌ అవుతుండటం గమనార్హం.


తగ్గని ఫెయిల్యూర్‌ శాతం

2022 డిసెంబరు మూడో వారంలో అనంత ఆర్టీఏ ఆఫీ్‌సలో ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో సెన్సర్‌ సేవలు ఆరంభమయ్యాయి. దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా ఫెయిల్యూర్‌ శాతం తగ్గడం లేదు. ఇప్పటి దాకా 7120 మంది ద్విచక్రవాహనదారులు డ్రైవింగ్‌ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 4824 మంది పాస్‌ అయ్యారు. మిగిలిన వారు ఫెయిల్‌ అయ్యారు. లైట్‌ మోటారు వెహికల్‌ డ్రైవింగ్‌ పరీక్ష కోసం 8300 మంది హాజరయ్యారు. ఇందులో 3420 మంది మాత్రమే పాస్‌ అయ్యారు. హెవీ మోటారు వెహికల్‌ డ్రైవింగ్‌ పరీక్ష కోసం 640 మంది హాజరయ్యారు. వీరిలో 286 మంది పాస్‌ అయ్యారు. లైట్‌ మోటారు వెహికల్‌, హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ పరీక్షల్లోనే ఎక్కువ శాతం ఫెయిల్‌ అవుతుండటం గమనార్హం.

అవగాహన కల్పించడంలో వైఫల్యం

ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌పై వాహనం నడిపే విధానంపై సంపూర్ణ అవగాహన కల్పించడంలో సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెన్సర్‌ ట్రాక్‌లో బ్రిడ్జి ఎక్కే సమయంలో క్రాసింగ్‌ వద్ద నేరుగా వెళ్లకుండా ముందుకు, వెనక్కి వాహనాన్ని నడపడం, రివర్స్‌ నడిపే సమయాల్లో ఎక్కువ శాతం ఫెయిల్‌ అవుతున్నట్లు సమాచారం. కొంత మంది సెన్సర్‌ ట్యాగ్‌ను నిర్దేశించిన సిగ్నల్స్‌ వద్ద సరిగా చూపకపోవడంతో ఫెయిల్‌ అవుతున్నట్లు సమాచారం. మరికొంత మంది సిగ్నల్స్‌ వద్ద ఒక చోట ట్యాగ్‌ను చూపించి, మరో ప్రాంతంలో వదిలేయడం ద్వారా ఫెయిల్‌ అవుతున్నారు. డ్రైవింగ్‌ చేసే సమయంలో పాటించాల్సిన పద్దతులపై వాహనదారులకు సరైన అవగాహన కల్పిస్తే ఫెయిల్‌శాతం తగ్గుతుంద ని బాధిత వాహనదారులు కోరుతున్నారు. స్ర్కీనపై వాహనం నడిపే విధానం చూపడంతోనే సంబంధిత అధికారులు సరిపెట్టుకుంటున్నార న్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష పాసైన వాహనదారులకు ఆటోమేటిక్‌ ట్రాక్‌లో వాహనం ఎలా నడపాలి.. ఎక్కడెక్కడ సెన్సర్‌ సిగ్నల్స్‌ అమర్చారు..? ఆ ప్రాంతంలో పాటించా ల్సిన పద్ధతులపై అవగాహన కల్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు కొన్ని డ్రైవింగ్‌ స్కూల్స్‌ యజమాన్యంతో కుక్కుకై ఎంపిక చేసిన వారికి మాత్రమే తగిన మెలకువలు ఇవ్వడంపై శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం. మిగతా వారికి కేవలం స్ర్కీనలో చూసి నడపాలని వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

టెస్ట్‌ డ్రైవ్‌కు అవకాశం ఇస్తే ప్రయోజనం

సెన్సర్‌ ట్రాక్‌పై డ్రైవింగ్‌ పరీక్షకు ముందు రోజుల్లో టెస్ట్‌ డ్రైవ్‌కు అనుమతిస్తే ఫెయిల్యూర్‌ శాతం తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలోనే పలువురు వాహనదారులతోపాటు ఓ మాజీ ప్రజాప్రతినిధి ఎల్‌ఎల్‌ఆర్‌ పాపైన వాహనదారులకు ముందస్తుగా టెస్ట్‌ డ్రైవ్‌కు అవకాశం కల్పించాలని జిల్లా ట్రాన్సపోర్టు అధికారిని కోరారు. ప్రతి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సెన్సర్‌ ట్రాక్‌పై డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి ముందస్తు టెస్ట్‌ డ్రైవ్‌కు అవకాశం కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే టెస్ట్‌ డ్రైవ్‌ కోసం నామమాత్రపు ఫీజు వసూలు చేసినా పర్వాలేదన్న వాదనలున్నాయి. అప్పట్లోనే ఇక్కడి నుంచి ట్రాన్సపోర్టు రాష్ట్ర ఉన్నతాధికారులకు టెస్ట్‌ డ్రైవింగ్‌ కోసం అనుమతించాలని లేఖ పంపినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటి దాకా ఎలాంటి సమాధానం లభించనట్లు తెలిసింది. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా తమకు సెన్సర్‌ ట్రాక్‌పై టెస్ట్‌ డ్రైవింగ్‌కు అవకాశం కల్పించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

కరెక్ట్‌గా వాహనం నడిపితేనే పాస్‌

డ్రైవింగ్‌ పరీక్షల్లో పారదర్శకత కోసమే ప్రభుత్వం సెన్సర్‌ సేవలను ప్రారంభించింది. అనంత ఆర్టీఏ ఆఫీ్‌సలో ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో సెన్సర్‌ ఇచ్చిన సంకేతాల ఆధారంగా డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. నిబంధనలకు అనుగుణంగా వాహనాన్ని నడిపితేనే పాస్‌ అవుతారు. లేదంటే ఫెయిల్‌కాక తప్పదు. ప్రస్తుతం ఆర్టీఏ ఆఫీ్‌సలో ప్రత్యేక స్ర్కీన ద్వారా డ్రైవింగ్‌ టెస్ట్‌ విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కువ శాతం ఫెయిల్‌ కావడంపై విశ్లేషించి, మరింతగా అవగాహన కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటాం.

- వీర్రాజు , జిల్లా ట్రాన్సపోర్ట్‌ అధికారి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 25 , 2024 | 11:54 PM