Share News

DASARI KIRAN : మానవ హక్కులు ఎక్కడ?

ABN , Publish Date - May 18 , 2024 | 12:48 AM

గొడవలు జరిగితే ఎక్కడైనా ప్రత్యర్థులు దాడి చేస్తారు. కొందరు చంపేయాలని చూస్తారు. కానీ తాడిపత్రిలో అందుకు భిన్నంగా జరిగింది. శాంతిభద్రతలను కాపాడే పేరిట అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఏవో వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాసరి కిరణ్‌ను చితకబాదాలని పోలీసులను డీఎస్పీ చైతన్య పురమాయించడం విస్తుగొలుపుతోంది. ఆ తరువాత

DASARI KIRAN : మానవ హక్కులు ఎక్కడ?
Kiran is in tears in the hospital

దాసరి కిరణ్‌పై దాడి పట్టదా..?

ఇప్పటికీ నమోదు కాని కేసు

ఆస్పత్రిలో ఉన్నా పట్టని పోలీసులు

గొడవలు జరిగితే ఎక్కడైనా ప్రత్యర్థులు దాడి చేస్తారు. కొందరు చంపేయాలని చూస్తారు. కానీ తాడిపత్రిలో అందుకు భిన్నంగా జరిగింది. శాంతిభద్రతలను కాపాడే పేరిట అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఏవో వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాసరి కిరణ్‌ను చితకబాదాలని పోలీసులను డీఎస్పీ చైతన్య పురమాయించడం విస్తుగొలుపుతోంది. ఆ తరువాత అతనిపట్ల వ్యవహరించిన తీరు అమానవీయంగా కనిపిస్తోంది. నిలువెల్లా రక్తంతో తడిసిపోయిన అతడిని చూసి.. ఎవరైనా నరికేశారేమో అనే భ్రమ కలుగుతుంది.


పోలీసులు ఆ స్థాయిలో కొట్టారు. ఇంత జరిగినా ఏ ఒక్క పోలీసు అధికారీ అతని స్టేట్‌మెంట్‌ రికార్డు చేయలేదు. ‘మెడికో లీగల్‌ కేసు’ కూడా నమోదు చేయలేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేయడం.. పోలీసుల వ్యవహారా శైలిని తెలియజేస్తోంది. యథేచ్ఛగా మానవహక్కుల ఉల్లంఘన జరిగినా.. సంబంధీకులు ఎవరూ స్పందిచకపోవడం విమర్శలకు తావిస్తోంది.

బతుకుతానని అనుకోలేదు..!

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దాసరి కిరణ్‌ చికిత్స పొందుతున్నాడు. ఆ రోజు ఏం జరిగింది అని అడిగితే.. కన్నీటిపర్యంతమవుతూ.. ‘నేను బతుకుతానని అనుకోలేదు.. విలేకరులు వచ్చి పలకరించేదాకా..’ అని అన్నాడు.


అసలేం జరిగింది..?

కిరణ్‌: అర్ధరాత్రి ఒకట్నిర గంటల సమయంలో పోలీసులు పెద్ద సంఖ్యలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి సమీపంలో తచ్చాడుతున్నారు. నేను ఇంకా పడుకోలేదు. ఇంటి ఆవరణంలో తిరుగుతున్నాను. ఓ పోలీసు ఇంటి గేటు తీశారు. దాసరి కిరణ్‌ నువ్వేనా అని హిందీలో అడిగారు. అవును అని చెప్పగానే డీఎస్పీ చైతన్య పిలుస్తున్నారని చెప్పారు. ఇంటి లోపలికి (జేసీపీఆర్‌ కుటుంబం ఉండే ప్రాంతం) వెళ్లగానే అక్కడ డీఎస్పీ చైతన్య, పోలీసులు ఉన్నారు. నన్ను చూడగానే బూతులు తిట్టారు. వీడిని లోపలికి వేయండి అని ఆదేశించారు. నన్ను కొట్టుకుంటూ బయట ఉన్న బస్సు లోపలికి తీసుకెళ్లారు. బస్సు లోపల లాఠీలతో చితకబాదారు. కాళ్లపై లాఠీ దెబ్బ పడటంతో కింద పడ్డాను. ఆ సమయంలోనే తలపై లాఠీలతో కొట్టారు. రక్తం కారుతున్నా వదిలిపెట్టలేదు. ఆ తరువాత రూరల్‌ సీఐ లక్ష్మికాంతరెడ్డి వచ్చారు. సర్‌.. రక్తం ఎక్కువ కారుతోంది.. టార్చ్‌లైట్‌ వేయండి అని అడిగాను. రక్తమొస్తే ఏమవుతుందిలే.. అరుగుతుందా తరుగుతుందా అని నిర్లక్ష్యంగా అన్నారు.


ఆస్పత్రికి ఎలా వచ్చారు..?

కిరణ్‌: కొట్టడం అయ్యాక బస్సులోనే సజ్జలదిన్నె వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బస్సు దిగే సమయంలో టౌన సీఐ మురళీకృష్ణ నా పరిస్థితి చూశారు. ఏమైంది అంటూ తన కర్చీఫ్‌ నా తలపై వేశారు. అక్కడున్న పోలీస్‌ సిబ్బందిని పిలిచి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చేసరికే నాకు మగత ఎక్కువైంది. ఏమైంది అని నర్సులు అడుగుతుంటే.. నరికి పడేస్తే చూసి తీసుకొచ్చాం అని ఎవరో చెప్పారు. అంతవరకే గుర్తుంది. రక్తగాయాలతో ఉన్న ఫొటో ఎవరు తీశారో గుర్తు లేదు. అది చూసి చాలామంది నేను చనిపోయానని అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారనుకుంటా. నాకు 6.30 గంటలకు మెలకువ వచ్చింది. ఆ తరువాత విలేకరులు వచ్చి పలకరించారు. అప్పటి వరకు నేను చచ్చాననే అందరూ అనుకున్నారు.

- అనంతపురం క్రైం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 18 , 2024 | 12:48 AM