Share News

Heavy Rains: ఉన్నతాధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్ కీలక సమీక్ష

ABN , Publish Date - Sep 02 , 2024 | 05:45 PM

ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో ఆ యా శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సోమవారం అమరావతిలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.

Heavy Rains: ఉన్నతాధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్ కీలక సమీక్ష

అమరావతి, సెప్టెంబర్ 02: ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో ఆ యా శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సోమవారం అమరావతిలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉన్నతాధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్‌లతో పశువులకు వైద్యం అందించాలన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో జంతు వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా పశువులకు వైద్య సేవలందించాలని సూచించారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లకుండా రైతులను అప్రమత్తం చేయాలని ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచన చేశారు.


ఇక విజయవాడ నగరంలోని బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో 163 బోట్లతో మత్స్యకారులు ముంపు ప్రాంత వాసులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సహాయక చర్యల్లో 187 మంది మత్స్యకారులు పాల్గొన్నారని వివరించారు. ఇక వరద నీరు పోటేత్తడంతో.. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని రైతులను వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఈ వర్షాలు, వరదల కారణంగా.. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగిందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు.


వరద సహాయ చర్యలపై ఉన్నతాధికారులతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విభాగాల వారీగా ఉన్నతాధికారులకు మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు అప్పగించారు. అలాగే అధికారులకు అప్పగించిన బాధ్యతలు ఏ మేరకు పూర్తి చేశారన్న విషయమై నారా లోకేశ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.


ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరద బాధితుల కోసం 81 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విజయవాడ నగరంలో నీట మునిగిన రవినగర్, వాంబే కాలనీ, జక్కంపూడి ప్రాంతాల్లో ఎంఐ-17 హెలీకాప్టర్ ద్వారా 3 వేల కిలోలు, ఎఎల్-హెచ్ ద్వారా 2 వేల కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు జారవేసినట్లు ఈ సమీక్షా సమావేశంలో మంత్రి లోకేశ్‌కు అధికారులు వివరించారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఆహారాన్ని రప్పించి బాధితులకు చేరవేసే బాధ్యతను సీనియర్ ఐఎఎస్ అధికారి జి.వీరపాండ్యన్‌కు మంత్రి లోకేశ్ అప్పగించారు.


పొరుగు జిల్లాలు బాపట్ల, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి ఆహార పొట్లాలను పంపించాలని ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఆదేశం. అదే విధంగా వరద ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 02 , 2024 | 05:45 PM