Share News

Education Department : పీజీ అడ్మిషన్లు ఢమాల్‌!

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:00 AM

రాష్ట్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ విద్య పరిస్థితి దయనీయంగా మారి ంది. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన పీజీ కోర్సులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. 2020లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దుచేసిన జగన్‌ ప్రభుత్వం చివరి వరకు దానిని పునరుద్ధరించలేదు.

Education Department : పీజీ అడ్మిషన్లు ఢమాల్‌!

  • ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో భారీగా తగ్గుదల

  • తొలిసారి 20వేల

  • దిగువకు పడిన ప్రవేశాలు

  • 2020లో పీజీకి ఫీజు

  • రీయింబర్స్‌మెంట్‌ రద్దు

  • జగన్‌ ప్రభుత్వ నిర్ణయంతో

  • పేదలకు ఉన్నత విద్య దూరం

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ విద్య పరిస్థితి దయనీయంగా మారి ంది. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన పీజీ కోర్సులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. 2020లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దుచేసిన జగన్‌ ప్రభుత్వం చివరి వరకు దానిని పునరుద్ధరించలేదు.

మొత్తంగా గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం పీజీ విద్యను అస్తవ్యస్తం చేసింది. అలాగే డిగ్రీ అడ్మిషన్లు పడిపోవడం కూడా పీజీ ప్రవేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఎన్నడూలేని విధంగా 2024-25 పీజీ ప్రవేశాలు మరింత ఘోరంగా పడిపోయాయి.

తాజాగా ఉన్నత విద్యామండలి విడుదల చేసిన లెక్కల ప్రకారం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు తొలిసారి 18,232కు పరిమితమయ్యాయి. ఒకప్పుడు 50వేల వరకు ఉన్న ప్రవేశాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.


కానీ అడ్మిషన్ల సంఖ్య ఇంత దారుణంగా 20వేల లోపునకు పడిపోవడం ఇదే తొలిసారి. గత వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ భారాన్ని క్రమంగా తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా పీజీ విద్యకు ఈ పథకాన్ని రద్దు చేసింది. పీజీ ఫీజుల్లో అక్రమాలు వెలికితీసి, మళ్లీ రీయింబర్స్‌మెంట్‌ అమలుచేస్తామని 2020లో ప్రకటించింది.

ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సులకూ ఫీజులు ఆపేసింది. అంతకుముందు పీజీ కోర్సులకు సంబంధించి కాలేజీలకు రూ.450కోట్లు చెల్లించాల్సి ఉండగా వాటిని పెండింగ్‌ పెట్టింది. జగన్‌ ప్రభుత్వం కావాలనే పథకాన్ని రద్దు చేసిందని కాలేజీ యాజమాన్యాలు నిర్ధారణకు వచ్చాయి. చివరకు ఫీజులు కట్టలేని పేద విద్యార్థులు డిగ్రీ దాటి పీజీ చదువులు కొనసాగించ లేకపోయారు.


డిగ్రీ అడ్మిషన్ల ప్రభావం

రాష్ట్రంలో డిగ్రీ చదివేవారి సంఖ్య పడిపోవడం కూడా పీజీ విద్యను దెబ్బతీసింది. ఏపీలో 4.47లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉంటే ఈ ఏడాది 1.51లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. గత రెండేళ్ల నుంచి దాదాపుగా ఇదే స్థాయిలో విద్యార్థులు డిగ్రీలో చేరుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యపై చేసిన రకరకాల ప్రయోగాలు డిగ్రీపై ప్రభావం చూపాయి.

భవిష్యత్తులోనూ పీజీకి విద్యార్థుల అడ్మిషన్లు తగ్గిపోయేలా గత ప్రభుత్వం సింగిల్‌ మేజర్‌ డిగ్రీ విధానం అమల్లోకి తెచ్చింది. మూడు సబ్జెక్టుల డిగ్రీ విధానంలో విద్యార్థులు వాటిలో ఏదో ఒకదానిపై పీజీలో చేరేవారు. కానీ, సింగిల్‌ మేజర్‌లో ఒక మేజర్‌ సబ్జెక్టు, ఒక మైనర్‌ సబ్జెక్టు ఉంటాయి. ఆ రెండిటిలో ఏదైనా ఒక సబ్జెక్టు ఆధారంగా పీజీలో చేరొచ్చు. అంటే గతంలో పీజీకి మూడు ఆప్షన్లు ఉంటే, ఇప్పుడు అవి రెండుకు తగ్గిపోయాయి.


ఐసెట్‌ సీట్ల కేటాయింపు

ఐసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తిచేసి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి మంగళవారం తెలిపింది.

మొత్తం 21,480 మంది దరఖాస్తు చేసుకోగా, 19,665 మంది అడ్మిషన్లకు ఆప్షన్ల ఎంపిక చేసుకున్నారని వివరించింది. 18,232 మందికి సీట్లు కేటాయించినట్లు పేర్కొంది. కాగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొత్తం 62,076 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కన్వీనర్‌ కోటాలో 46,454 సీట్లుంటే వాటిలో సగం కూడా భర్తీ కాలేదు.

Updated Date - Aug 21 , 2024 | 05:00 AM