Share News

AP Elections: బాబోయ్.. రూ.10కే రెండు క్వార్టర్లు, 50కే బస్తా బియ్యం!

ABN , Publish Date - May 11 , 2024 | 04:56 AM

పది రూపాయలకే రెండు క్వార్టర్‌ బాటిళ్లు.. యాభై రూపాయలకే బియ్యం బస్తా!.. ఓటమి భయంతో ఒంగోలు వైసీపీ అభ్యర్థులు ఓటర్లకు పంచుతున్న తాయిలాల పరంపర ఇది! ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు ఓటమి భయంతో ఇప్పటికే అనేక రకాలుగా ఓటర్లను మభ్యపెట్టారు. ఇక పోలింగ్‌ దగ్గర పడడంతో ఓటుకు నోటుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో ఓటుకు రూ.3వేలు పంపిణీ చేశారు.

AP Elections: బాబోయ్.. రూ.10కే రెండు క్వార్టర్లు, 50కే బస్తా బియ్యం!

  • హవాలా తరహాలో నోటుపై సీరియల్‌ కోడ్‌

  • రాష్ట్రంలో ప్రలోభాల పర్వానికి లేచిన తెర

  • ఒంగోలులో 2 రైస్‌ షాప్‌ల సీజ్‌, రిలీజ్‌

ఒంగోలు(కార్పొరేషన్‌), మే 10: పది రూపాయలకే రెండు క్వార్టర్‌ బాటిళ్లు.. యాభై రూపాయలకే బియ్యం బస్తా!.. ఓటమి భయంతో ఒంగోలు వైసీపీ (YSR Congress) అభ్యర్థులు ఓటర్లకు పంచుతున్న తాయిలాల పరంపర ఇది! ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు ఓటమి భయంతో ఇప్పటికే అనేక రకాలుగా ఓటర్లను మభ్యపెట్టారు. ఇక పోలింగ్‌ దగ్గర పడడంతో ఓటుకు నోటుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో ఓటుకు రూ.3వేలు పంపిణీ చేశారు. అయినా మార్పు లేకపోవడంతో కొత్త ఎత్తుగడలకు తెర తీశారు. నగరంలోని డివిజన్లలో మగవారికి భారీగా మద్యం, రెండు ఓట్లకు ఒక బియ్యం బస్తా పంచారు. బియ్యంతోపాటు శివారు కాలనీల్లో నూనె ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. ఇంత చేసినా వారిలో విజయంపై భరోసా మాత్రం కనిపించడం లేదు. ‘అవసరమైతే అదనంగా మరో వెయ్యి ఇవ్వండి. లేదంటే అల్లర్లకు తెగబడండి, ఓటు మాత్రం వైసీపీకి పడాల్సిందే’ అని ఆ పార్టీ పెద్దలు డివిజన్‌ నాయకులకు, కార్యకర్తలకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.

హవాలా తరహాలో నోట్ల టోకెన్లు

ఒంగోలులో వైసీపీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు ఓట్లు రాబట్టుకునేందుకు హవాలా విధానం తెరపైకి తెచ్చారు. తమ వద్ద ఉన్న రూ.పది, ఇరవై, 50నోట్ల సీరియల్‌ నంబర్లు రాసి, ఆ నంబర్ల లిస్టును బార్ల యజమానులకు ఇస్తారు. తర్వాత నోట్లను ఓటర్లకు పంచుతారు. పది నోటు తీసుకుని బార్‌ షాప్‌కు వెళ్తే సీరియల్‌ నంబర్‌ను తన వద్ద ఉన్న లిస్ట్‌తో సరిపోల్చి.. రెండు క్వార్టర్‌ బాటిళ్ల మద్యం అందజేస్తారు. ఇలా రూ.20కి మూడు, రూ.50కి ఆరు బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే, బియ్యం పంపిణీకి రెండు ఓట్లకు ఒక రూ.50 నోటు ఇవ్వడంతోపాటు, నగరంలోని కొన్ని బియ్యం హోల్‌సేల్‌ వ్యాపారులతో ఒప్పదం చేసుకుని వారికి నోట్ల జాబితా అందజేశారు. దీంతో ఓటర్లు రూ.50 ఇవ్వగానే వ్యాపారులు ఒక బస్తా బియ్యం అందజేశారు. విషయం తెలిసి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు దాడులు చేసి రెండు దుకాణాలను సీజ్‌ చేశారు. పంపిణీ చేస్తుండగా పులి వెంకటరెడ్డి కాలనీలో 554 బస్తాల బియ్యం, లారీని పట్టుకున్నారు. అయితే కోడ్‌ను ఉల్లంఘించి దుకాణాల ఎదుట వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. చివరికి తనిఖీలకు వెళ్లిన అధికారులు అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి మధ్యాహ్నం తర్వా త అలాంటిదేమీ లేదంటూ మాటమార్చి రెండు దుకాణాలను తిరిగి తెరిపించేశారు. ఈ వ్యవహారంలో వన్‌టౌన్‌ సీఐ లక్ష్మణ్‌ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీదైతే వదిలేయ్‌!

అర్ధరాత్రి ‘కోట్ల’ సంచుల కలకలం!

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో గురువారం అర్ధరాత్రి నోట్ల సంచులు కలకలం రేపాయి. లేపాక్షి మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ సమీపంలో అర్ధరాత్రి వైసీపీ నేతలు కొందరు వాహనంలో డబ్బు సంచులతో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో పోలీసులు సైరన్‌ వేసుకుని రావడంతో భయపడి, కాలనీలోకి వెళ్లి ఇళ్ల మధ్య డబ్బు సంచులను గిరాటు వేసి వెళ్లిపోయారు. ఇది చూసిన కాలనీకి చెందిన రామాంజినమ్మ, సాధిక అనే మహిళలు చెరో రెండు సంచులు ఎత్తుకెళ్లి ఇళ్లలో దాచుకున్నారు. కొంతసేపటి తరువాత పడేసివెళ్లినవారు తిరిగి వచ్చి అక్కడ వెతికారు. అదే సమయంలో డబ్బు సంచులు తీసుకున్న మహిళలు బయటకు వచ్చారు. ‘ఇక్కడ డబ్బు సంచులు వేసి వెళ్లాం. తీసుకుంది మీరే కదా..? ఇవ్వండి’ అని వారు దబాయించి వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసుకున్నారు.

పులివెందులలో ఓటుకు రూ.2వేలు

సీఎం జగన్‌ ఇలాకా పులివెందులలో ఓటర్లకు డబ్బులు యథేచ్ఛగా పంపిణీ చేస్తున్నారు. వైసీపీ వారు ఓటుకు రూ.2000 ఇస్తే, టీడీపీ 1000 ముట్టజెబుతోంది. ఎవరి స్థాయిలో వారు ఇంటింటికీ వెళ్లి డబ్బులు పంచుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి చేశామని చెప్పుకొంటున్న జగన్‌ తన నియోజకవర్గంలోనే ఓటుకు రూ.2000 ఇస్తుండడం చర్చనీయాంశమైంది.

Updated Date - May 11 , 2024 | 08:11 AM