Share News

YS Jagan: సీఎంగా ఉన్నప్పటి భద్రత ఇవ్వండి

ABN , Publish Date - Aug 06 , 2024 | 02:30 AM

ముఖ్యమంత్రి హోదాలో తనకు గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని..

YS Jagan: సీఎంగా ఉన్నప్పటి భద్రత ఇవ్వండి
YS Jagan Mohan Reddy

  • హైకోర్టులో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌.. వ్యక్తిగత రక్షణ అధికారులను ఇవ్వాలి

  • కౌంటర్‌ అసాల్ట్‌ టీములు, జామర్‌ కూడా ఉండాలి.. తగు ఆదేశాలివ్వండి

  • నాకిచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో ఏసీ పనిచేయడం లేదు

  • ముందస్తు నోటీసివ్వకుండా జడ్‌ ప్లస్‌ రక్షణ తగ్గించారు

  • ప్రతివాదులుగా డీజీపీ, నిఘా ఐజీ, కేంద్ర, రాష్ట్ర హోం శాఖలు

అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి హోదాలో తనకు గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని.. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) హైకోర్టును ఆశ్రయించారు. తనకు పర్సనల్‌ సెక్యూరిటీ అధికారులు(పీఎస్‌వోలు), కౌంటర్‌ అసాల్ట్‌ టీములు, జామర్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించిన జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తగ్గించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగం ఐజీ, గుంటూరు ఎస్పీ, రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.

పిటిషన్‌లో ఏముంది..?

2019లో విశాఖ ఎయిర్‌ పోర్టులో నాపై కోడికత్తితో దాడి జరిగింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి కాకముందే నాకు ఉన్నత స్థాయి భద్రత కల్పించారు. నేను సీఎం అయ్యాక జడ్‌ ప్లస్‌ కేటగిరీ కింద 139 మందితో రక్షణ కల్పించారు. 2024 ఎన్నికల ఫలితాలు ప్రకటించి నెల గడవకముందే నాకున్న భద్రతా సిబ్బంది సంఖ్యను 59కి తగ్గించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రక్షణ తగ్గించడం సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమే. ఎన్నికల ప్రచారంలో నాపై రాయితో దాడి చేశారు. ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నా ఇల్లు, కార్యాలయం వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం నాకు ఇద్దరు పీఎస్‌వోలు మాత్రమే ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలకు నాకంటే ఎక్కువ మంది పీఎస్‌వోలను ఇచ్చారు. పోలీసులు నాకిచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కూడా ప్రయాణానికి అనుకూలంగా లేదు. అందులో ఏసీ పనిచేయడం లేదు. ఈ కారణంగా ఇటీవల ఓ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవలసి వచ్చింది. నన్ను భౌతికంగా లేకుండా చేస్తామని అధికార కూటమి నేతలు ప్రకటనలు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందు ఉంచుతున్నాను. సీఎం హోదాలో నాకున్న జడ్‌ ప్లస్‌ భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జూన్‌ 7న కేంద్ర హోం శాఖకు వినతి సమర్పించాం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని జూన్‌ 3 వరకు నాకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండిఅని జగన్‌ పిటిషన్‌లో కోరారు.

Updated Date - Aug 06 , 2024 | 06:56 AM