Share News

AP News: వైఎస్ జగన్ వినుకొండ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 19 , 2024 | 10:38 AM

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో బుధవారం రాత్రి ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా హత్యకు గురైన షేక్‌ రషీద్‌ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు.

AP News: వైఎస్ జగన్ వినుకొండ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన

వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో బుధవారం రాత్రి ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా హత్యకు గురైన షేక్‌ రషీద్‌ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. హతుడు షేక్ రషీద్, హంతకుడు షేక్ జిలానీ ఇద్దరూ గతంలో మిత్రులే. ఇద్దరూ గతంలో ఖాన్‌ ముఠాలో సభ్యులే. అయినప్పటికీ ‘చావు రాజకీయం’ కోసం మాజీ సీఎం జగన్ ఇవాళ (శుక్రవారం) వినుకొండ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలకమైన ప్రకటన చేశారు.


వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పష్టం చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్ మోహ్మన్ రెడ్డి వచ్చి రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించవచ్చునని క్లారిటీ ఇచ్చారు. కానీ జన సమీకరణతో ప్రదర్శనలు చేయవద్దని, ప్రస్తుతం వినుకొండ పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అనవసరంగా ఎవ్వరూ రోడ్లు పైకి రావద్దని ఆయన పిలుపునిచ్చారు.


చావు రాజకీయ..

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం వినుకొండకు వెళ్తున్నారు. వైసీపీలో గ్యాంగ్‌ వార్‌ కారణంగా మరణించిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. జరిగింది దారుణం.. ఘోరం! కానీ ఈ హత్యను టీడీపీపైకి నెట్టేసి పరామర్శకు బయలుదేరడమే జగన్‌ మార్కు రాజకీయంగా కనిపిస్తోంది. ఐదేళ్ల తన పాలనలో పల్నాడులో వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలు సాగించినా పట్టించుకోకుండా, హత్యలు జరిగినా స్పందించని జగన్‌...ఇప్పుడు వినుకొండకు బయలుదేరడమే పెద్ద విచిత్రమని జనాలు చెప్పుకుంటున్నారు.


పక్కా గ్యాంగ్‌ వార్‌...

బుధవారం రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై రషీద్‌ అనే యువకుడు దారుణ హత్యోదంతం తెలిసిన విషయమే. షేక్‌ జిలానీ ఈ హత్యకు పాల్పడ్డాడు. అయితే వీళ్లిద్దరూ ఒకప్పుడు మిత్రులే. ఇద్దరూ వైసీపీలో క్రియాశీలంగా వ్యవహరించారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహంతో వినుకొండలో రౌడీగా ఎదిగిన పీఎస్‌ ఖాన్‌ గ్యాంగ్‌లో రషీద్‌, జిలానీ పనిచేశారు. అయితే వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఏటా తొలి ఏకాదశి రోజున వినుకొండలో కొండ తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. గత ఏడాది తిరునాళ్ల సందర్భంగా గ్యాంగ్‌ లీడర్‌ ఖాన్‌ ఓ లాడ్జిలో పార్టీ ఏర్పాటు చేశాడు. జిలానీ ఆ రోజు బీర్‌ బాటిళ్లతో దాడి చేయడంతో ఒక యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో పీఎస్‌ ఖాన్‌ రషీద్‌కు మద్దతుగా నిలిచాడు. రషీద్‌, ఖాన్‌ గ్యాంగ్‌లో మరి కొందరు కలిసి గత సంవత్సరం జూలైలో జిలానీ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. జిలానీ ఇంట్లో లేకపోవడంతో అతడి అన్న జిమ్‌ జానీపై దాడి చేసి గాయపరిచారు. తాజాగా ఈ హత్య జరిగింది.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరుతూ జగన్ లేఖ.. ఎందుకంటే..

వైసీపీ నేత ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీలపై బిగుస్తున్న ఉచ్చు..

For more AP News and Telugu News

Updated Date - Jul 19 , 2024 | 10:50 AM