Share News

Pawan Kalyan: చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలివ్వలేదు!

ABN , Publish Date - Jun 28 , 2024 | 03:42 AM

డేటా ఎంట్రీ ఆపరేటర్ల లాంటి చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా చిన్నపాటి ఉద్యోగుల కుటుంబాలు వేదనతో ఉన్నాయని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Pawan Kalyan: చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలివ్వలేదు!

  • వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకాలు బయటపడుతున్నాయి

  • నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయండి

  • కాంట్రాక్టర్ల బ్లాక్‌లిస్ట్‌ వివరాలూ అందజేయండి

  • అధికారులకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశం

అమరావతి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): డేటా ఎంట్రీ ఆపరేటర్ల లాంటి చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా చిన్నపాటి ఉద్యోగుల కుటుంబాలు వేదనతో ఉన్నాయని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలోని తన క్యాంప్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు.

గత ప్రభుత్వం ప్రతి శాఖలో చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్‌ విభాగం ప్రారంభించిన రోడ్లు, వంతెనల పనులు, వాటికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఏషియన్‌ ఇన్పాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ) నుంచి సమీకరించిన రుణం, వాటి వినియోగంపై కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా కేంద్రం అమలు చేసే పీఎంజీఎస్‌వై, ఆర్‌సీపీడబ్ల్యూఈ, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ పథకాల ద్వారా వచ్చిన నిధులు ఏ మేరకు వినియోగించారో చర్చించారు.

పెండింగ్‌లో ఉన్న పనులు, అందుకు కారణాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో రహదారులు ఏ మేరకు దెబ్బతిన్నాయో? ఎంత కాలం నుంచి మరమ్మతులు చేయడం లేదో, కేటాయించిన నిధులను ఏం చేశారో నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులను నిర్మిస్తే ఆ మొత్తాన్ని రీయింబర్స్‌ చేస్తామని ఏఐఐబీ చెప్పిందని తెలిసి ఉపముఖ్యమంత్రి ఆశ్చర్యపోయారు.

పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతున్నారా? లేదా? అని ప్రశ్నించారు. వివరాలివ్వాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌ నిధులతో ఏప్రాంతంలో ఏ పని చేస్తున్నామో, అందుకు సంబంధించి అనుసరించాల్సిన నాణ్యతా ప్రమాణాలు, బడ్జెట్‌ వివరాలు ప్రజలకు తెలియజేసేలా కచ్చితంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Updated Date - Jun 28 , 2024 | 03:45 AM