Share News

Rajangaram : రోడ్డుపై వృద్ధురాలికి గాయాలు.. కారు ఆపి పరామర్శించిన పురందేశ్వరి

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:08 AM

రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు తీవ్రగాయాల పాలై రోడ్డుపై పడి ఉంది.. అటుగా వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ఆ ఘటన చూసి చలించిపోయారు.

Rajangaram : రోడ్డుపై వృద్ధురాలికి గాయాలు.. కారు ఆపి పరామర్శించిన పురందేశ్వరి

  • వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాటు

రాజానగరం, ఆగస్టు 25: రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు తీవ్రగాయాల పాలై రోడ్డుపై పడి ఉంది.. అటుగా వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ఆ ఘటన చూసి చలించిపోయారు. వెంటనే కాన్వాయ్‌ ఆపి ఆమె దగ్గరకు వెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకుని కంగారు పడొద్దంటూ ధైర్యం చెప్పారు.

వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన ఖండవల్లి రాధాకృష్ణమాచార్యులు, రమా మణి (55) దంపతులు పదేళ్లగా దివాన్‌చెరువులో నివాసం ఉంటున్నారు.

రమామణి తన సోదరి కుమార్తె వివాహానికి పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని అయినపర్రు గ్రామానికి వెళ్లి తిరిగి ఆదివారం రాజమహేంద్రవరం వరకు బస్సులో వచ్చారు. అక్కడ నుంచి ఆటోలో దివాన్‌చెరు బయల్దేరారు. భర్తకు ఫోన్‌ చేసి సెంటర్‌లో ఉండమని చెప్పారు.

గైట్‌ కళాశాల వద్ద ఆటో దిగి నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా రాజానగరం వైపు వేగంగా వస్తున్న కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలైంది.

అదే సమయంలో అటుగా వెళుతున్న ఎంపీ పురందేశ్వరి కారు ఆపి గాయపడిన మహిళ పరిస్థితిని గమనించారు. వెంటనే ప్రైవేట్‌ వాహనంలో జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఆమె వెంట రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు.

Updated Date - Aug 26 , 2024 | 05:08 AM