Share News

AP News: మందులో ఏపీ రికార్డ్!

ABN , Publish Date - Apr 11 , 2024 | 09:09 AM

Liquor Sales: సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డి.. మద్యం విక్రయాల్లో అరుదైన రికార్డు సొంత చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా సాధించని రికార్డులు నెలకొల్పారు. ఇంతవరకూ ఏ ప్రభుత్వంలోనూ విక్రయించని స్థాయి లో భారీగా మద్యం విక్రయించారు. ఐదేళ్ల పాలనలో అక్షరాలా..

AP News: మందులో ఏపీ రికార్డ్!

  • ఐదేళ్లలో 1,24,312 కోట్ల మద్యం విక్రయం

  • మద్యనిషేధం హామీ ఇచ్చిన జగన్‌ ఘనత

  • ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ అమ్మకాలు

  • ఒక్క సంవత్సరంలోనే రూ.30 వేల కోట్లు

  • 2019–24 మధ్య 1,05,000 కోట్ల ఆదాయం

  • పథకాలకు సగం డబ్బు మద్యం నుంచే నిషేధం లేదు

  • నియంత్రణా లేదు.. టీడీపీ ఐదేళ్ల హయాంలో 75,284 కోట్ల లిక్కర్‌ అమ్మకం

సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) .. మద్యం విక్రయాల్లో అరుదైన రికార్డు సొంత చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా సాధించని రికార్డులు నెలకొల్పారు. ఇంతవరకూ ఏ ప్రభుత్వంలోనూ విక్రయించని స్థాయి లో భారీగా మద్యం విక్రయించారు. ఐదేళ్ల పాలనలో అక్షరాలా రూ.1,24,312 కోట్ల మద్యం అమ్మారు. ఈ గణాంకాలు చూసి ఎక్సైజ్‌ శాఖ అధికార వర్గాలే అవాక్కవుతున్నాయి. తమ 30 ఏళ్ల సర్వీసులో ఈ స్థాయి అమ్మకాలు చూడలేదంటున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఏకంగా రూ.30,078 కోట్ల విలువైన మద్యం అమ్మారు. అంటే నెలకు రూ.2,506 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో నెలకు రూ.1,675 కోట్లు విక్రయించారు. విభజన తర్వాత ఆంధ్రలో అంతకు భారీగా అమ్మకాలు నమోదవుతున్నాయి. చివరకు కొవిడ్‌ కారణంగా అన్ని రంగాలు కుదేలైన సమయంలో కూడా రాష్ట్రంలో భారీగా మద్యం అమ్ముడైంది. కొవిడ్‌ మహమ్మారి ఉన్న రెండేళ్లలో ఒక సంవత్సరంలో రూ.25,023 కోట్ల మద్యం విక్రయించారు. టీడీపీ ప్రభుత్వంలో 2018–19లో మొదటిసారి రూ.20,128 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. మొత్తంగా తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో రూ.75,284 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమ్మకాలను భారీగా పెంచింది. మద్యం ఆదాయంలో సగం సొమ్మును సంక్షేమ పథకాలకు మళ్లిస్తోంది. మద్యనిషేధం లేదు.. నియంత్రణ అసలే లేకుండా పోయింది.

దేశం దాటి దా‘రుణం’.. వైఎస్ జగన్‌ అప్పుల వెనుక..!



తగ్గించి.. పెంచి..

సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చిన ప్రభుత్వం మొదట్లో అమ్మకాలు తగ్గించే చర్యలు చేపట్టినట్లు హడావుడి చేసింది. 4,380 షాపులను 3,500కు తగ్గించింది. ఆ తర్వాత రెండో విడత కింద 2,934కు కుదించింది. కొవిడ్‌ సమయంలో మద్యం ధరలు భారీగా పెంచింది. దీంతో కొంతకాలం విక్రయాలు తగ్గి ఆదాయం పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మళ్లీ అమ్మకాలు పెంచుకునేందుకు ధరలు తగ్గించేసింది. ధరలు తగ్గించిన 2020–21లో 186.47 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మితే.. 2023–24లో 346.69 లక్షల కేసులు అమ్మారు.

Liquor-Sales.jpg

పిచ్చి బ్రాండ్లతోనే రికార్డులు

ఈ స్థాయిలో మద్యం అమ్మకాలను పిచ్చి బ్రాండ్లతోనే సాధించడం గమనార్హం. ఎందుకంటే జగన్‌ ప్రభుత్వం వచ్చాక పాపులర్‌ బ్రాండ్లను పక్కనపెట్టి, సర్కారు పెద్దలు అనామక బ్రాండ్లను మార్కెట్‌లోకి తెచ్చాయి. ప్రభుత్వ మద్యం షాపుల్లో ఈ బ్రాండ్లనే బలవంతంగా అమ్మించారు.

మద్యంతో సంక్షేమం..

నగదు బదిలీతో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. అమ్మఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం, చే యూత, కాపునేస్తం, వాహనమిత్ర వంటి పథకాల ద్వారా డీబీటీ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తోంది. ఇలా ఐదేళ్లలో సుమారు రూ.2 లక్షల కోట్ల నగదును ఖాతాల్లో వేసినట్లు చెబుతోంది. అంటే అందులో సగం డబ్బులు మద్యం ఆదాయం ద్వారానే సమకూరాయి.

Updated Date - Apr 11 , 2024 | 09:21 AM