Share News

AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీ ఎమ్మెల్యేను కలిసిన వైసీపీ కార్పొరేటర్లు

ABN , Publish Date - Aug 07 , 2024 | 03:18 PM

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో పరాభవం ముటగట్టుకున్న వైసీపీకి మరో షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలిస్తున్నాయి తాజా పరిణామాలు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఉన్న నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి రావడానికి క్యూ కడుతున్నారు.

AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీ ఎమ్మెల్యేను కలిసిన వైసీపీ కార్పొరేటర్లు

విజయవాడ: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో పరాభవం ముటగట్టుకున్న వైసీపీకి మరో షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలిస్తున్నాయి తాజా పరిణామాలు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఉన్న నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి రావడానికి క్యూ కడుతున్నారు. ఆ పార్టీపై ప్రజల్లో విపరీతంగా పెరిగిన అసహనంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మరో పదేళ్ల వరకు వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదనే అంచనాల నడుమ నేతలు, కార్యకర్తలు తలొదిక్కున చూస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో వైసీపీ భారీ షాక్ తగలబోతోంది. ఆ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరిని బుధవారం ఆయన నివాసంలో కలిశారు. మర్యాదపూర్వకంగానే ఆయన్ని కలిశామంటున్న కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వంలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.


వీరంతా కలిసి త్వరలో కూటమిలోని వివిధ పార్టీల్లో చేరనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. ఎనిమిది మంది కార్పొరేటర్లు సుజనాను కలవడంపై వైసీపీ నేతల్లో తీవ్ర అంతర్మథనం ఏర్పడింది. అప్రమత్తమైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు కార్పొరేటర్లను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే బీజేపీ.. టీడీపీ అధిష్టానాన్ని సంప్రదించి.. ఒకటి రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వంలోకి వారిని ఆహ్వనించే అవకాశం ఉంది. బీజేపీ ఎమ్మెల్యేను కలిసిన వారిలో అప్పాజీ, అత్తులూరి ఆదిలక్ష్మీ, మురిపిళ్ల రాజేశ్, గుడివాడ నరేంద్ర, హర్షత్, మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాదురి, ఉమ్మడి శెట్టి బహుదూర్ ఉన్నారు.


దెబ్బ మీద దెబ్బ..

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా ఇప్పుడు ఆ లిస్టులో పెండెం దొరబాబు చేరారు. 2024ఎన్నికల్లో తనకు కాదని పిఠాపురం నియోజకవర్గం సీటు వంగా గీతకు ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. వంగా గీతపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 70వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

అయితే పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడంతోనే వైసీపీకి రాజీనామా చేసినట్లు దొరబాబు వెల్లడించారు. మరో వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన శిద్ధా రాఘవరావు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. తర్వాత 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి 2024ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు.


మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయనకు మెుండి చేయి చూపించడంతో ఇటీవల రాజీనామా చేశారు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య సైతం ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతు తెలిపారు.

2014 ఎన్నికల్లో జగన్ ఆయనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. మనస్తాపం చెంది పార్టీని వీడారు. ఇలా వరుసగా నేతలు వైసీపీని వీడుతుండటానికి బలమైన కారణం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు శాశ్వతంగా వద్దనుకున్నారు. ప్రజల్లో వైసీపీపై పుట్టిన విసుగే ఎన్నికల్లో ఆ పార్టీని11 స్థానాలకు పరిమితం చేసిందనే రాజకీయ నిపుణుల మాట. ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు కూటమి పార్టీల్లోకి క్యూ కడుతున్నారు.

Updated Date - Aug 07 , 2024 | 03:18 PM