Share News

Tirumala Laddu: తిరుమల లడ్డూలకు వాడుతున్న నెయ్యేంటి.. సరఫరా చేస్తున్నదెవరు

ABN , Publish Date - Sep 20 , 2024 | 05:21 PM

వైసీపీ రాకముందు తిరుమల లడ్డూల తయారీకి కర్ణాటక నుంచి సరఫరా అయ్యే నందినీ నెయ్యిని వాడేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నందినీ నెయ్యి వాడకాన్ని ఆపేసింది.

Tirumala Laddu: తిరుమల లడ్డూలకు వాడుతున్న నెయ్యేంటి.. సరఫరా చేస్తున్నదెవరు

తిరుమల: తిరుమల లడ్డూలు ఎంత ఫేమసో మనకు తెలిసిందే. వీటిని ఆలయ వంటగదిలో తయారు చేస్తారు. ఆ ప్రదేశాన్ని పోటు అంటారు. నెలకు 42 వేల కిలోల నెయ్యి, 22 వేల 500 కిలోల జీడిపప్పు, 15 వేల 000 కిలోల ఎండుద్రాక్ష, 6వేల కిలోల యాలకులు, శనగపిండి, చక్కెర తదితర పదార్థాలను టీటీడీ కొనుగోలు చేస్తుంది. గతంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నెయ్యిని దిగుమతి చేసుకునేది. తిరుపతి దేవస్థానంలో రోజుకు మూడు లక్షల లడ్డూలు తయారవుతాయని అంచనా.

వేంకటేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూలకు 'జియోగ్రాఫికల్ ఇండికేషన్' ట్యాగ్ కూడా ఉంది. అయితే ఈ లడ్డూల చుట్టే ఇప్పుడు వివాదం అల్లుకుంది. వీటి తయారీకి వాడిన నెయ్యిని అపవిత్రం చేశారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. వైసీపీ రాకముందు తిరుమల లడ్డూల తయారీకి కర్ణాటక నుంచి సరఫరా అయ్యే నందినీ నెయ్యిని వాడేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నందినీ నెయ్యి వాడకాన్ని ఆపేసింది.


రిపోర్ట్‌లో ఏముందంటే..

జులై 17న గుజరాత్‌లోని సెంటర్-రన్ నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌లోని సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్(CALF) ల్యాబ్ బుధవారం ఓ నివేదిక విడుదల చేసింది. ప్రసిద్ధ తిరుపతి లడ్డూలను తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును కనుగొన్నట్లు తెలిపింది. వైసీపీ అధికారంలో ఇదంతా జరిగింది.


ఏఆర్ డైరీ చుట్టూ వివాదం..

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి వివాదంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్. ఈ కంపెనీ అత్యధికంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ టెండర్లు, రివర్స్ టెండర్లు వేసి .. అతి తక్కువ ధరలకు కాంట్రాక్టులను దక్కించుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా.. టీటీడీకి అత్యధికంగా ఈ కంపెనీ నెయ్యి సరఫరా చేసింది. దీంతో వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ ఏఆర్ డైరీపైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నాయి.

ఈ కంపెనీ బటర్ ఆయిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని నెయ్యిగా మార్చి ఆలయ పోటుకు సరఫరా చేసేదని టీడీపీ చెబుతోంది. ఈ సంస్థకు టీటీడీకి నెయ్యి సరఫరా చేసేంత సామర్థ్యం లేదని అతి తక్కువ ధరకు టెండర్లు తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని అంటున్నారు. సామర్థ్యం లేని కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీలోనూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేశారు. దీంతో ఏళ్ల తరబడి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్.. నెయ్యిని తక్కువకు ఇవ్వలేమని చెప్పింది. అలా ఏఆర్ డైరీ టెండర్లకు.. రివర్స్ టెండర్లకు తగ్గించుకుంటూ కాంట్రాక్టులు పొందింది.


టెండర్లలో ఒక ధర కోట్ చేస్తే, రివర్స్ టెండర్లలో మరింత తక్కువకు కోట్ చేసి టెండర్లను దక్కించుకున్నట్లు తేలింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన టెండర్లలో కేజీ నెయ్యి రూ. 610 కిగానూ.. రివర్స్ టెండర్లలో రూ. 424కి మాత్రమే సరఫరా చేస్తామని ఆ కంపెనీ అంగీకరించింది. అంటే కేజీకి రూ.190కిపైగా తగ్గింపు ఇచ్చి టెండర్లు పొందిందనమాట.

2022లోనూ ఇలాగే చేసింది. టెండర్లలో రూ. 414 కు కోట్ చేసి.. రివర్స్ టెండర్లలో రూ. 337 కు కోట్ చేసి దక్కించుకున్నట్లు రికార్డుల్లో ఉంది. దీంతో ఏఆర్ డైరీ చుట్టూ వివాదం అల్లుకుంది. వైసీపీ వచ్చాక ఈ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించడంతో.. లడ్డూల నాణ్యత దెబ్బతిందని టీడీపీ ఆరోపిస్తోంది. నెయ్యిని అపవిత్రం చేయడంలో ఏఆర్ డైరీ ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూల తయారీకి మొత్తంగా 5 కంపెనీలు నెయ్యిని సరఫరా చేస్తున్నాయి.

Also Read:

తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలపై..

అక్కినేని.. అవార్డులు.. బిరుదులు

ఒక్క రోజులో రూ.6 లక్షల కోట్లు లాభం..

For MoreAndhra Pradesh NewsandTelugu News..


null

Updated Date - Sep 20 , 2024 | 07:32 PM