Share News

Stock Markets Today: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కలిసొస్తున్న అంతర్జాతీయ పరిణామాలు

ABN , Publish Date - Aug 26 , 2024 | 11:39 AM

అంతర్జాతీయంగా ఉన్న సానుకూల పరిణామాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఉదయం 9.24 గంటలకు లాభాలతో షురూ అయ్యాయి.

Stock Markets Today: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కలిసొస్తున్న అంతర్జాతీయ పరిణామాలు

ముంబయి: అంతర్జాతీయంగా ఉన్న సానుకూల పరిణామాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఉదయం 9.24 గంటలకు లాభాలతో షురూ అయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 312.33 పాయింట్లు పెరిగి 81,398.54 వద్దకు చేరుకోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 94.15 పాయింట్లు ర్యాలీ చేసి 24,917.30 వద్దకు చేరుకుంది. గత శుక్రవారం నాలుగో వరుస సెషన్‌లో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ 33.02 పాయింట్లు లేదా 0.04 శాతం పెరిగి 81,086.21 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11.65 పాయింట్లు లేదా 0.05 శాతం పెరిగి 24,823.15 వద్ద ముగిసింది. తద్వారా వరుసగా ఏడో సెషన్‌లోనూ లాభాలను నమోదు చేసినట్లైంది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) శుక్రవారం రూ.1,944.48 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇవాళ ప్రారంభ సెషన్‌లో బ్యారెల్‌ బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ ధర 79.65 డాలర్లకు చేరుకుంది.

లాభాల్లో ఇవి.. నష్టాల్లో అవి..

బీఎస్‌ఇ సెన్సెక్స్‌లో నమోదైన 30 కంపెనీలలో టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ , బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా లాభపడ్డాయి. ఐటీసీ, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, అదానీ పోర్ట్స్‌, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి.


గ్లోబల్ మార్కెట్లు...

ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ మాత్రమే సానుకూల దిశగా పయనిస్తుండగా.. సియోల్, టోక్యో, షాంఘై తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. కాగా గడిచిన శుక్రవారం అమెరికా మార్కెట్లు గణనీయమైన లాభాలతో ముగిశాయి. జాక్సన్ హోల్ సమావేశంలో US ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తన ప్రసంగంలో వడ్డీ రేట్ల కోత ఉండే అవకాశం ఉందని చెప్పడంతో మార్కెట్లు సానుకూలంగా పయనించాయి. జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయకుమార్‌ మాట్లాడుతూ... అమెరికాలో వడ్డీ రేట్ల కోత అంతర్జాతీయ మార్కెట్లపై మంచి ప్రభావం చూపిస్తుందని చెప్పారు. జెరోమ్ పావెల్ ప్రసంగం.. పెట్టుబడిదారులకు ఆశాకిరణంగా నిలిచిందని పేర్కొన్నారు.

For Latest News click here

Updated Date - Aug 26 , 2024 | 11:39 AM