Share News

Hyderabad: డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..

ABN , Publish Date - Jun 13 , 2024 | 10:16 AM

డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న దంపతులతో పాటు.. వారికి సహకరిస్తున్న మరో ముగ్గురు నిందితులను నార్కోటిక్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 మొబైల్స్‌, రూ.4లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..

- దంపతులతో సహా ఐదుగురి అరెస్ట్‌

- రూ. 4లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

ఇతర ప్రాంతాల నుంచి నగరానికి డ్రగ్స్‌ సరఫరా ఆగడం లేదు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా.. కొంతమందిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపినా మార్పు కనిపించడం లేదు. బుధవారం కూడా నార్కోటిక్‌ పోలీసులు రూ.4 లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌ సిటీ: డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న దంపతులతో పాటు.. వారికి సహకరిస్తున్న మరో ముగ్గురు నిందితులను నార్కోటిక్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 మొబైల్స్‌, రూ.4లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌(Telangana Narcotics Bureau Director) తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట ఆకాశ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఫైజల్‌, మస్రత్‌ ఉన్నీసాబేగం అలియాస్‌ నదియా దంపతులు. ఈజీ మనీకి అలవాటుపడిన ఇద్దరూ.. గుట్టుగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసి డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. వారి స్నేహితులు డబీర్‌పురాకు చెందిన మహ్మద్‌ అబ్రార్‌ ఉద్దీన్‌, బహదూర్‌పురాకు చెందిన రహ్మత్‌ఖాన్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఫైజల్‌, ఉన్నీసాబేగం దంపతులు తరచుగా బెంగళూరుకు వెళ్లేవారు. బెంగళూరు పీఎన్‌టీ కాలనీలో ఉండే స్నేహితుడు జునైద్‌ఖాన్‌ సహకారంతో అక్కడి స్మగ్లర్స్‌ వద్ద ఎండీఎంఏ డ్రగ్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. అక్కడి నుంచి సరుకును నగరానికి తెచ్చి తన ముఠాలోని స్నేహితుల సహకారంతో సిటీలోని కస్టమర్లకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు.

ఇదికూడా చదవండి: Hyderabad: విద్యుత్‌ స్తంభం ఎక్కి తాగుబోతు హల్‌చల్‌..


పోలీసుల కళ్లుగప్పి..

కొంతకాలంగా తెలంగాణ పోలీసులు మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దాంతో స్మగ్లర్స్‌ నగరం నుంచి మకాం మార్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దాంతో సిటీలో డిమాండ్‌కు తగ్గ సప్లై జరగడం లేదు. దాంతో సయ్యద్‌ ఫైజల్‌, ఉన్నీసాబేగం దంపతులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్లాన్‌ చేశారు. ఉన్నీసాబేగంను మాత్రమే బెంగళూరుకు పంపించి అక్కడ డ్రగ్స్‌ కొనుగోలు చేసిన తర్వాత సాధారణ ప్రయాణికురాలిగా నగరానికి వచ్చి సరుకును అందజేసేలా ప్రణాళిక వేశారు. అలా కొంతకాలంగా పోలీసుల కళ్లుగప్పి నగరంలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. దాంతో నార్కోటిక్‌ బ్యూరో పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఫైజల్‌, ఉన్నీసాబేగం నెట్‌వర్క్‌పై కన్నేసిన పోలీసులు రెండు రోజుల క్రితం ఉన్నీసాబేగం బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తెచ్చిన విషయం తెలుసుకొని బహదూర్‌పురా పోలీసులతో కలిసి దాడిచేశారు. దంపతులతో పాటు.. వారికి సహకరిస్తున్న నిందితులను, బెంగళూరుకు చెందిన మరో నిందితుడిని మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. నగరంలో వీరు ఇప్పటి వరకు 19 మందితో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా ఎంతమంది కస్టమర్స్‌ ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 10:16 AM