Share News

Nyay Sankalp Padyatra: రాహుల్ యాత్రలో నటి స్వర భాస్కర్

ABN , Publish Date - Mar 17 , 2024 | 02:49 PM

రాహుల్ గాంధీ సారథ్యంలోని 'జన్ న్యాయ్‌ పాదయాత్ర' ముంబైలో కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పాదయాత్రలో నటి స్వర భాస్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాహుల్‌తో కలిసి పాదయాత్రలో ఆమె పాల్గొన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారిక 'ఎక్స్' ఖాతాలో షేర్ చేసింది.

Nyay Sankalp Padyatra: రాహుల్ యాత్రలో నటి స్వర భాస్కర్

ముంబై: రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారథ్యంలోని 'జన్ న్యాయ్‌ పాదయాత్ర' (Jan Nyay Padyatra) ముంబైలో కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పాదయాత్రలో నటి స్వర భాస్కర్ (Swara Bhasker) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాహుల్‌తో కలిసి పాదయాత్రలో ఆమె పాల్గొన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారిక 'ఎక్స్' ఖాతాలో షేర్ చేసింది. రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ సైతం పాల్గొన్నారు.


రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర', 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లపై ఈ సందర్భంగా స్వర భాస్కర్ ప్రశంసలు కురిపించారు. యాత్రల లక్ష్యం ఏమిటో పేరులోనే ఉందని, దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో చేపట్టినదే భారత్ జోడో అని అన్నారు. ''గత పదేళ్ల నుంచి విద్వేషం అనే జబ్బుతో దేశం బాధపడుతోంది. ప్రేమించండి, ద్వేషం వద్దనే లక్ష్యంతోనే ఈ దేశం ఏర్పడిందని, ఈ విషయాన్ని ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టు తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రజల మనసులోని మాట వినేందుకు ఏ రాజకీయవేత్త అయినా దేశవ్యాప్తంగా పర్యటించారా అనేది తనకు తెలియదని, ఈ యాత్ర ద్వారా ప్రజలతో మమేకమవ్వాలన్నదే రాహుల్ అభిమతమని చెప్పారు. 2022 డిసెంబర్‌లో జరిగిన 'భారత్ జోడో' యాత్రలోనూ స్వర భాస్కర్ పాల్గొన్నారు.


రాహుల్ న్యాయ్ సంకల్ప్ పాదయాత్ర ఆదివారంనాడు దక్షిణ ముంబైలోని మహాత్మా హోం 'మణి భవన్' నుంచి ప్రారంభమై, 1942లో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన ఆగస్టు క్రాంతి మైదాన్ వరకూ కొనసాగనుంది. పలువురు 'ఇండియా' కూటమి నేతలు సైతం ఈ యాత్రలో పాల్గొన్నారు. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన రాహుల్ 63 రోజుల యాత్ర ముంబైలో ముగియనుంది.

Updated Date - Mar 17 , 2024 | 02:49 PM