Share News

Sanjay Raut on Emergency: వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నా ఎమర్జెన్సీ విధించి ఉండేవారు..

ABN , Publish Date - Jul 13 , 2024 | 05:19 PM

1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25వతేదీని 'రాజ్యాంగ హత్యా దినం'గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ఎమర్జెన్సీని సమర్ధించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి అప్పట్లో ప్రధానిగా ఉన్నా అప్పటి పరిస్థితిని బట్టి ఎమర్జెన్సీ విధించి ఉండేవారని అన్నారు.

Sanjay Raut on Emergency: వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నా ఎమర్జెన్సీ విధించి ఉండేవారు..

ముంబై: దేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అత్యవసర పరిస్థితి (Emergency) విధించిన జూన్ 25వతేదీని 'రాజ్యాంగ హత్యా దినం'గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శివసేన (UBT) నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) తప్పుపట్టారు. ఎమర్జెన్సీని సమర్ధించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) అప్పట్లో ప్రధానిగా ఉన్నా అప్పటి పరిస్థితిని బట్టి ఎమర్జెన్సీ విధించి ఉండేవారని అన్నారు. ఎమర్జెన్సీని శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే, రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కూడా బహిరగంగంగానే సమర్ధించినట్టు శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.


''వారికి (BJP) మరో పని లేదు. ఇది (ఎమర్జెన్సీ) జరిగి 50 ఏళ్లయింది. ప్రజలు కూడా ఎమర్జెన్సీని మరిచిపోయారు. ఈ దేశంలో ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? కొందరు వ్యక్తులు దేశంలో అరాచకవాదాన్ని వ్యాప్తి చేయాలనుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించవద్దని రామ్‌లీలా మైదాన్‌ నుంచి మన జవాన్లు, ఆర్మీకి పిలుపునిచ్చారు. అలాంటి పరిస్థితిలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నా ఆయన కూడా ఎమర్జెన్సీ విధించేవారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. కొందరు వ్యక్తులు దేశంలో బాంబులు తయారు చేస్తూ వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. అమిత్‌షాకు ఎమర్జెన్సీ గురించి ఏమీ తెలియదని నేను చెప్పదలచుకున్నాను. అప్పట్లో బాలాసాహెబ్ థాకరే కూడా ఎమర్జెన్సీకి సపోర్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ సైతం సపోర్ట్ చేసింది'' అని సంజయ్ రౌత్ తెలిపారు.

Central Government: : జూన్‌ 25 రాజ్యాంగ హత్యా దినం


ఇందిరను సపోర్ట్ చేసిన బాలాసాహెబ్

''శివసేన నేత బాలాసాహెబ్ థాకరే సైతం 1975 ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని బహిరంగంగానే సపోర్ట్ చేశారు. ముంబైలో ఆమెకు స్వాగతం పలికారు. దేశంలో అరాచకవాదాన్ని అదుపు చేయడానికి ఎమర్జెన్సీ అవసరమని బాలాసాహెబ్ భావించారు. అందులో తప్పేముంది? బీజేపీ పదేళ్ల పాలనలో జరిగిందేమిటి? వాళ్లు రాజ్యాంగ పరిరక్షకులు కూడా కాదు'' అని సంజయ్ రౌత్ చెప్పరు. ఎమర్జెన్సీ సమయంలో కూడా రాజ్యాంగాన్ని హత్య చేశారని వాజ్‌పేయి భావించలేదని అన్నారు. ఆ తర్వాతే వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగాన్ని హత్య చేశారని అటల్‌జీనే అననప్పుడు వాళ్లెవరు? అని బీజేపీని ప్రశ్నించారు. చేసేందుకు పనేమీ లేకపోవడంతో వల్లే వారు ప్రజలను తప్పదారి పట్టిస్తున్నారని, ఎమర్జెన్సీ గురించి మాట్లాడదలిస్తే మోదీ పదేళ్ల పాలనలో ప్రతిరోజూ ప్రజాస్వామ్యం హత్యకు గురవుతున్న విషయాన్ని కూడా గుర్తుచేసుకోవాలని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

For Latest News and National News click here

Updated Date - Jul 13 , 2024 | 05:30 PM