Share News

Bengaluru: ఆడ్వాణీకి భారతరత్నపై పలువురి హర్షం

ABN , Publish Date - Feb 04 , 2024 | 10:55 AM

బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీ(Lalkrishna Advani)కి అత్యున్నత ‘భారతరత్న’ ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంతో బీజేపీకి ప్రత్యేకించి ఆడ్వాణికి దశాబ్దాలకాలంగా సంబంధాలు ఉన్నాయి. దేశంలో బీజేపీ అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర కీలకమైనది.

Bengaluru: ఆడ్వాణీకి భారతరత్నపై పలువురి హర్షం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీ(Lalkrishna Advani)కి అత్యున్నత ‘భారతరత్న’ ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంతో బీజేపీకి ప్రత్యేకించి ఆడ్వాణికి దశాబ్దాలకాలంగా సంబంధాలు ఉన్నాయి. దేశంలో బీజేపీ అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర కీలకమైనది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆయన ఆశయమై ఉండేది. దేశవ్యాప్తంగా రథయాత్ర ద్వారా ప్రజలను సంఘటితం చేశారు. ఆడ్వాణీ రథయాత్ర రాష్ట్రం లో కొనసాగిన విధంపై నేటికీ చర్చించుకుంటారు. ఆడ్వాణీతో కలసి బీజేపీని అభివృద్ధిలో యడియూరప్ప కీలక భూమిక పోషించారు. బెంగళూరు, హుబ్బళ్లి, ధారవాడ, బెళగావి ప్రాం తాల్లో ఆయన పలు సందర్భాల్లో పర్యటించారు. అటువంటి అగ్రనేతకు భారతరత్న దక్కడంపై మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయనకు భారతరత్న దక్కడం గర్వంగా ఉందని కొనియాడారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజాజీవనంలో ఆయన నాయకత్వం తిరుగులేనిదని, ఎంపీగా, కేంద్రమంత్రి గా, ఉప ప్రధానిగా సేవలందించారని తెలిపారు. వ్యక్తిగతంగా, సంఘ్‌ పరంగా ఆయన మార్గదర్శకాలను తాను మరవలేనన్నారు. ఈ అరుదైన సంతోష సమయంలో పార్టీకార్యకర్తల తరపున ప్రత్యేక అభినందనలు అంటూ కొనియాడారు. ప్రతిపక్షనేత అశోక్‌ మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులకు గౌరవమైన పదవి దక్కినట్టు ఉందన్నారు. పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఒక మహాసాధకుడికి భారతరత్న లభించిందని పేర్కొన్నారు. ఇదో ఉద్వేగభరిమైన అనుభూతి అన్నారు. దేశంలోని కోట్లాదిమంది బీజేపీ అభిమానులకు పండుగ రోజన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ స్పందిస్తూ దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో సమీపం నుంచి ఆయన తీరు చూశానని, క్రమశిక్షణ, నైతిక విలువలకు ఆడ్వాణీ మరో పేరు అన్నారు. అటువంటి అగ్రనేతకు భారతరత్న దక్కడం సంతోషదా యకమన్నారు.

కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి హుబ్బళ్లిలో మీడియాతో మాట్లాడుతూ తాము రాజకీయాల్లోకి వచ్చేందుకు ముందు నుంచి ఆడ్వాణీని చూశామని, హుబ్బళ్లి ధారవాడతో ఆయనకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని, ఎన్నో సందర్భాలలో ఇక్కడి సభలలో పాల్గొన్నారని, అలా తాము సన్నిహితులమయ్యామని గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం, జేడీఎస్‌ నే త కుమారస్వామి ‘ఎక్స్‌’ ద్వారా అభినందనలు తెలిపారు. అత్యున్నతమైన గౌరవానికి అర్హులైన వ్యక్తి ఆడ్వాణీని ఎంపిక చేశారన్నారు. దేశ రాజకీయ చరిత్రలో క్రమశిక్షణ, నిబద్ధత, స్నేహశీలత, కఠోర పరిశ్రమలకు ఆడ్వాణి మరో పేరు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర మాట్లాడుతూ ఆడ్వాణీలాంటి అగ్రనేత ఎప్పటికీ భారతరత్న అని, ఆయనకు తగిన గౌరవం లభించిందన్నారు. మరింతకాలం ఆయురారోగ్యాలతో దేశ సాధనలు చూడాలని ఆకాంక్షించారు.

Updated Date - Feb 04 , 2024 | 10:55 AM