Share News

National : శాక్రమెంటో కౌంటీ సుపీరియర్‌ జడ్జిగా జయ

ABN , Publish Date - May 22 , 2024 | 04:45 AM

అమెరికాలో విజయవాడ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, ప్రేమలత దంపతుల కుమార్తె.. జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

National : శాక్రమెంటో కౌంటీ సుపీరియర్‌ జడ్జిగా జయ

  • అమెరికాలో విజయవాడ మహిళ ఘనత

విజయవాడ, మే 21 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో విజయవాడ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, ప్రేమలత దంపతుల కుమార్తె.. జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 2022 నుంచి ఇదే కోర్టులో జయ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. జయ తండ్రి బాడిగ రామకృష్ణ 2004-09 వరకు మచిలీపట్నం ఎంపీగా చేశారు.

రామకృష్ణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జయ మూడో కుమార్తె. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌లో బీఏ పూర్తిచేసిన అనంతరం అమెరికా వెళ్లారు. శాంటాక్లారా విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా (జూరిస్‌ డాక్టర్‌ డిగ్రీ) పొందారు. 10 ఏళ్లకుపైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ కొనసాగించారు. జయతోపాటు మరో భారత సంతతి న్యాయమూర్తి రాజ్‌ సింగ్‌ బధేషా సహా 18 మందిని జడ్జిలుగా నియమిస్తూ గవర్నర్‌ న్యూసోమ్‌ ప్రకటన చేశారు.

Updated Date - May 22 , 2024 | 04:45 AM