Share News

Kyrgyzstan :మేం భారత్‌కు తిరిగి వచ్చేస్తాం!

ABN , Publish Date - May 20 , 2024 | 05:30 AM

విదేశీ విద్యార్థులే లక్ష్యంగా కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలతో భారతీయులు వణికిపోతున్నారు. హాస్టల్‌ గదులు వదిలి బయటకు రావడం లేదు. అక్కడి విద్యాసంస్థలు పరీక్షలను వాయిదా వేశాయి. చాలా మంది భారత్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

Kyrgyzstan :మేం భారత్‌కు తిరిగి వచ్చేస్తాం!

  • కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న విద్యార్థుల వేడుకోలు

  • చాలా భయంగా ఉంది: నల్లగొండ విద్యార్థిని

పుణె/హైదరాబాద్‌, పెందుర్తి, మే 19: విదేశీ విద్యార్థులే లక్ష్యంగా కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలతో భారతీయులు వణికిపోతున్నారు. హాస్టల్‌ గదులు వదిలి బయటకు రావడం లేదు. అక్కడి విద్యాసంస్థలు పరీక్షలను వాయిదా వేశాయి. చాలా మంది భారత్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘బిష్కెక్‌లోని యూనివర్సిటీ హాస్టల్‌ నుంచి నన్ను, మరికొంత మంది విద్యార్థులను 30 కిలోమీటర్ల దూరంలోని ప్రైవేటు వసతి గృహానికి తరలించారు’ అని తెలంగాణలోని నల్లగొండకు చెందిన ఓ విద్యార్థిని ఫోన్‌లో తెలిపారు.

యూనివర్సిటీలో కొంత భద్రత ఉన్నప్పటికీ బిష్కెక్‌లో విద్వేషాలు పెరిగిపోవడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు చెప్పారు. ఏపీ, విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతానికి చెందిన పది మంది వైద్య విద్యార్థులు కూడా బిష్కెక్‌లో ఇరుక్కుపోయారు.

ఇక, శుక్రవారం రాత్రి తాను ఉంటున్న ప్రాంతానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఓ హాస్టల్‌పై స్థానికులు దాడి చేశారని మహారాష్ట్రలోని బీడ్‌కు చెందిన ఎంబీబీఎస్‌ విద్యార్థి వెల్లడించారు. తమ హాస్టల్‌లో లైట్లు ఆపేసి 24 గంటలుపైగా అవుతోందని మరోవిద్యార్థి చెప్పారు. చాలా మంది అల్పాహారం చేసేందుకు క్యాంటీన్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - May 20 , 2024 | 05:51 AM