Share News

2024 Elections: ఎన్నికల ప్రచారాన్ని బాయ్‌కాట్ చేసిన ఆ గ్రామం.. ఎందుకో తెలుసా?

ABN , Publish Date - Mar 22 , 2024 | 08:45 PM

తామిచ్చిన హామీలను నెరవేర్చని రాజకీయ పార్టీలు (Political Parties) అప్పుడప్పుడు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటాయి. నాయకులు కనిపించినప్పుడు వారిని అడ్డుకొని హామీలు పూర్తి చేయమని నిలదీయడమో, మరోసారి ఓటు అడిగేందుకు తమ ప్రాంతంలో అడుగుపెట్టొద్దని హెచ్చరించడమో వంటివి చోటు చేసుకుంటాయి. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా కేరళలోని (Kerala) ఓ గ్రామం కూడా అదే పంతానికి దిగొచ్చింది.

2024 Elections: ఎన్నికల ప్రచారాన్ని బాయ్‌కాట్ చేసిన ఆ గ్రామం.. ఎందుకో తెలుసా?

తామిచ్చిన హామీలను నెరవేర్చని రాజకీయ పార్టీలు (Political Parties) అప్పుడప్పుడు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటాయి. నాయకులు కనిపించినప్పుడు వారిని అడ్డుకొని హామీలు పూర్తి చేయమని నిలదీయడమో, మరోసారి ఓటు అడిగేందుకు తమ ప్రాంతంలో అడుగుపెట్టొద్దని హెచ్చరించడమో వంటివి చోటు చేసుకుంటాయి. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా కేరళలోని (Kerala) ఓ గ్రామం కూడా అదే పంతానికి దిగొచ్చింది. తమ గ్రామంలోకి ఎన్నికల ప్రచారం (Election Campaign) కోసం ఏ ఒక్కరూ రావొద్దని తేల్చి చెబుతున్నారు. ఇందుకు కారణం.. ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మెరుగైన రోడ్లు వేయకపోవడమే. ఆ వివరాల్లోకి వెళ్తే..


కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌లో ‘నడువిల్’ (Naduvil) అనే ఓ గ్రామం ఉంది. అక్కడి రోడ్లు ఎంతో అధ్వాన్నంగా ఉంటాయి. ముఖ్యంగా.. నడువిల్లి పంచాయతీ పరిధిలోని 9, 10, 11, 12 వార్డుల్లో ఉన్న నాలుగు ప్రధాన రహదారులు మరింత దారుణంగా తయారయ్యాయి. వీటిని మరమ్మత్తు చేసి, మెరుగైన రోడ్లు వేయాలని గ్రామస్తులు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. కానీ.. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వారి గోడుని పట్టించుకోలేదు. రోడ్లు సరిగ్గా లేకపోవడంతో.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా.. అత్యవసర పరిస్థితుల్లో తమ ఊరికి డ్రైవర్లు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే.. తమ గ్రామంలో ఎలాంటి ఎన్నికల ప్రచారానికి అనుమతించబోమని వాళ్లు ప్రకటించారు.

తమ ప్రాంతానికి ఓట్లు అడిగేందుకు అభ్యర్థులెవరూ రాకూడదంటూ.. వివిధ చోట్ల ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేశారు. రోడ్లు వేస్తామని రాజకీయ పార్టీలు బూటకపు వాగ్ధానాలు ఇవ్వడం తప్ప మరమ్మత్తులు చేపట్టిన దాఖలాలు లేవని.. వారి మాటల్ని తాము ఇకపై విశ్వసించమని గ్రామస్తులు తేల్చి చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రాతపూర్వక హామీ ఇస్తేనే ఈ ఎన్నికల్లో తాము పాల్గొంటామని.. లేకపోతే ఓట్లన్నీ నోటాకే వేస్తామని చెప్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ బాయ్‌కాట్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు సైతం పాల్గొంటున్నారు. మరోవైపు.. ఇటీవలే తాము రెండు రోడ్లకు నిధులు కేటాయించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపడతామని పంచాయతీ అధికారులు చెప్పడం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 08:45 PM