Share News

LK Advani: ఆర్ఎస్ఎస్ కార్యదర్శి నుంచి భారత రత్న వరకు.. స్ఫూర్తిదాయకం అద్వానీ జీవితం

ABN , Publish Date - Feb 03 , 2024 | 01:11 PM

ఎల్‌కే అద్వానీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు మార్మోగుతోంది. ఆయన సేవలకుగానూ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటిస్తున్నట్లు కేంద్రం శనివారం వెల్లడించింది. ఎల్‌కే అద్వానీ(LK Advani) పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ.

LK Advani: ఆర్ఎస్ఎస్ కార్యదర్శి నుంచి భారత రత్న వరకు.. స్ఫూర్తిదాయకం అద్వానీ జీవితం

ఢిల్లీ: ఎల్‌కే అద్వానీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు మార్మోగుతోంది. ఆయన సేవలకుగానూ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటిస్తున్నట్లు కేంద్రం శనివారం వెల్లడించింది. ఎల్‌కే అద్వానీ(LK Advani) పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. కొన్ని దశాబ్దాలపాటు భారత దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన వయోభారంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఆయన దేశానికి చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయాయి.

1998 నుండి 2004 వరకు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వంలో, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో అద్వానీ హోం మంత్రిగా తరువాత డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన 1927 నవంబర్ 8న కరాచీలో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) శ్రీ కిషించంద్ అద్వానీ, జ్ఞానీదేవి దంపతులకు జన్మించారు. ఎల్‌కే అద్వానీ కుటుంబం సింధీ హిందువుల శాఖకు చెందింది. ఆయన్ని ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1999లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డుతో ప్రదానం చేసింది. తాజాగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న(Bharath Ratna) ఆయన్ని వరించింది.

అయోధ్య కోసం పోరాటం..

అయోధ్యలో(Ayodhya) రామ మందిర నిర్మాణానికి అడుగులు పడటంలో జరిగిన పోరాటంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. 90 వ దశకంలో రామమందిర ఉద్యమానికి అద్వానీ, మురళీ మనోహర్ జోషి నాయకత్వం వహించారు. ఎల్‌కే అద్వానీ నేతృత్వంలో 1990 లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అయోధ్యలోని రామ జన్మభూమికి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. మందిర్ వహీ బనాయేంగే నినాదంతో అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లారు. మురళీ మనోహర్ జోషి కూడా ఈ రథయాత్రలో కీలకంగా వ్యవహరించారు. ఈ రథయాత్రలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు.

వ్యక్తిగత సమాచారం..

అద్వానీ కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. 1936 - 1942 వరకు అక్కడే చదువుకున్నారు. ఆయన 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) కార్యదర్శిగా నియమితులయ్యారు. దీంతో అప్పటి నుంచి సామాజిక సేవవైపు మళ్లారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం రాజస్థాన్‌లోని మత్స్య - అల్వార్‌కు మకాం మార్చింది.


1. 1947లో అద్వానీ RSS కరాచీ విభాగానికి కార్యదర్శిగా నియమితులయ్యారు.

2. 1951లో భారతీయ జనసంఘ్ సభ్యుడిగా మారారు. దీనిని శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థాపించారు.

3 . 1966 నుంచి 1967 వరకు జన్ సంఘ్ నాయకుడిగా ఉన్నారు.

4. 1970 -1976 వరకు అద్వానీ ఢిల్లీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

5. 1973లో జనసంఘ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

6. 1976 - 1982 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.

7. 1977లో జనసంఘ్ రద్దుతో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి జనతా పార్టీలో చేరారు.

8 . 1977 లోక్‌సభ ఎన్నికలలో జనతా పార్టీ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

9. జనవరి 1980 నుంచి ఏప్రిల్ 1980 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పని చేశారు.

10 . 1980లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 1986 వరకు ఆ పదవిలో కొనసాగారు.

11. 1982లో అద్వానీ 3వ సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

12. 1986 - 1991 వరకు బీజేపీ అధ్యక్ష పదవిలో కొనసాగారు.

13. 1988లో 4వసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

14 . 1989లో లోక్‌సభ సభ్యుడయ్యారు.

15. 1989 - 1991 వరకు లోక్‌సభలో BJP పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు.

16. 1990 -1991 వరకు లోక్‌సభ సెక్రటేరియట్ కమిటీలో ఛైర్మన్‌గా ఉన్నారు.

17. 1991లో రెండోసారి లోక్ సభకు ఎన్నికయ్యారు.

18. 1991 - 1993 వరకు సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

19 . 1993 - 1998 వరకు మళ్లీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు.

20 . 1998లో 12వ లోక్‌సభకు 3వసారి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

21 . 1998 -1999 వరకు కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేశారు.

22. 1999లో లోక్‌సభకు 4వ సారి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

23. అక్టోబర్ 1999 - మే 2004 వరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.

24. జూన్ 2002 - మే 2004 వరకు డిప్యూటీ పీఎంగా పని చేశారు.

25 . జులై 1, 2002 -ఆగస్టు 25, 2002 వరకు మరోశాఖకు మంత్రిగా పని చేశారు.

26. 2004లో లోక్‌సభకు 5వ సారి తిరిగి ఎన్నికై ప్రతిపక్ష పాత్ర వహించారు.

27. ఆగస్టు 5, 2006 - మే 2009 వరకు, LK అద్వానీ హోం వ్యవహారాల కమిటీలో సభ్యుడు.

28 . 2009లో 6వసారి 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

29. 2009లో మే నుంచి డిసెంబర్ నెల వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.

30. డిసెంబర్ 15, 2009న జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా మారారు.

31. జూన్ 10, 2013న అద్వానీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2024 | 01:13 PM