Share News

Northern states : ఉత్తరాది అతలాకుతలం

ABN , Publish Date - Aug 02 , 2024 | 02:40 AM

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో క్లౌడ్‌ బర్‌స్టతో కులు, పధార్‌, మండి, సిమ్లా జిల్లాలను వరద ముంచెత్తింది. 45 మంది గల్లంతవగా.. వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి.

 Northern states : ఉత్తరాది అతలాకుతలం

  • హిమాచల్‌లో క్లౌడ్‌ బరస్ట్‌తో కుంభవృష్టి!

  • 45 మంది గల్లంతు.. ఐదుగురి దుర్మరణం

  • ఉత్తరాఖండ్‌లో రాత్రివేళ పోటెత్తిన వరద

  • రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు 12 మంది మృతి

  • నీటిలోనే ఢిల్లీ.. ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు

  • రాజస్థాన్‌లోనూ భారీ వర్షాలు.. ముగ్గురి మృతి

  • 11 రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

సిమ్లా, డెహ్రాడూన్‌, జైపూర్‌, ఆగస్టు 1: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో క్లౌడ్‌ బర్‌స్టతో కులు, పధార్‌, మండి, సిమ్లా జిల్లాలను వరద ముంచెత్తింది. 45 మంది గల్లంతవగా.. వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శ్రీఖండ్‌ మహదేవ్‌ సమీపంలో బుధవారం రాత్రి క్లౌడ్‌ బర్‌స్టతో సర్పారా, గాన్వీ, కుర్బన్‌ నల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి. పార్వతి నదిపై మలానా డ్యామ్‌ కొట్టుకుపోయి దిగువ ప్రాంతాలను నీరు ముంచెత్తింది. శిమ్లా జిల్లా రాంపూర్‌లోని సమేజ్‌ఖడ్‌లో 30 మంది కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు మృతిచెందారు. మండి జిల్లా తెరాంగ్‌ సమీపంలోని రాజ్‌బన్‌ గ్రామం వద్ద మరో క్లౌడ్‌ బరస్ట్‌ జరిగింది. ఏడుగురు గల్లంతవగా ముగ్గురు ప్రాణాలు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కులు జిల్లాలో ఏడుగురు కొట్టుకుపోయారు.

మలానా జల విద్యుత్‌ కేంద్రంలో పలువురు చిక్కుకుపోయారు. బియాస్‌ నది ఉధృతి, కొండచరియలు విరిగిపడడంతో కీలకమైన మనాలీ-చండీగఢ్‌ జాతీ య రహదారి పలుచోట్ల తీవ్రంగా దెబ్బతిన్నది. కాగా, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో రాత్రికి రాత్రే వరద పోటెత్తింది. పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. డెహ్రాడూన్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 12 మంది మృతిచెందారు.

హరిద్వార్‌లోనే ఆరుగురు చనిపోయారు. ఇక్కడ 21 సెం.మీ. వర్షపాతం న మోదైంది. కేదార్‌నాథ్‌ మార్గంలో 1,500 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో 425 మందిని హెలికాప్టర్‌ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, సైన్యం, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని చాలా ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఆరుచోట్ల ఒక్క రోజులోనే 10 సెం.మీ.పైగా వర్షపాతం నమోదైంది. వివిధ ఘటనల్లో ఐదుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ను వర్షాలు ముంచెత్తాయి. ఓ ఇంట్లోకి వరద చేరడంతో ఆరేళ్ల బాలిక సహా ముగ్గురు మృతిచెందారు. హిమాచల్‌, పంజాబ్‌, హరియాణా, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గోవాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Updated Date - Aug 02 , 2024 | 02:40 AM