Share News

NTA : యూజీసీ-నెట్‌ పరీక్ష రద్దు

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:44 AM

నీట్‌ పరీక్ష ర్యాంకింగ్‌లు, గ్రేస్‌ మార్కుల వ్యవహారంతో అబాసుపాలై.. సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురవుతున్న జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) తాజాగా మరో అపవాదును మూటగట్టుకుంది.

NTA : యూజీసీ-నెట్‌ పరీక్ష రద్దు

  • పరీక్ష సమగ్రతపై ఐ4సీ హెచ్చరికలు.. రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం

  • తదుపరి పరీక్ష తేదీ త్వరలో ప్రకటన.. బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్‌

న్యూఢిల్లీ, జూన్‌ 19: నీట్‌ పరీక్ష ర్యాంకింగ్‌లు, గ్రేస్‌ మార్కుల వ్యవహారంతో అబాసుపాలై.. సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురవుతున్న జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) తాజాగా మరో అపవాదును మూటగట్టుకుంది. ఆ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ-నెట్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ బుధవారం రాత్రి ప్రకటించింది. దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌), పీహెచ్‌డీ ప్రవేశాలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కొలువులకు అర్హతకు ఎన్‌టీఏ ఏటా జూన్‌, డిసెంబరు సెషన్లలో జాతీయ అర్హత పరీక్ష(యూజీసీ-నెట్‌)ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..! జూన్‌ సెషన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా మంగళవారం రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరిగాయి.

11 లక్షల మంది అభ్యర్థులు ఈ సెషన్‌కు దరఖాస్తు చేసుకోగా.. తొమ్మిది లక్షల మంది పరీక్ష రాశారు. అయితే.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సైబర్‌ క్రైమ్‌ హెచ్చరికల విశ్లేషణ యూనిట్‌-- ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) యూజీసీ-నెట్‌ పరీక్ష సమగ్రతకు భంగం(లీకేజీ అనుమానాలు!) వాటిల్లినట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. దీంతో.. ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ‘‘యూజీసీ-నెట్‌లో అత్యున్నత స్థాయి పారదర్శకత, ప్రమాణాలకు.. పరీక్ష పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. తదుపరి పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.


నిజానికి యూజీసీ-నెట్‌ను ఇప్పటి వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ)గా నిర్వహించేవారు. ఎన్‌టీఏ మొదటిసారి పేపర్‌/పెన్‌/ఓఎంఆర్‌ షీట్‌ రూపంలో మంగళవారం పరీక్ష నిర్వహించింది. ఈ విధానంలో పరీక్షను నిర్వహించడం వల్ల ప్రశ్నపత్రం లీకై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ‘‘బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతితో యువత జీవితాలతో చెలగాటమాడుతోంది’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 03:44 AM