Share News

Ravneet Singh: రాహుల్‌పై కేంద్ర మంత్రి టెర్రరిస్టు వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఫైర్

ABN , Publish Date - Sep 15 , 2024 | 08:46 PM

సిక్కు వర్గాలను ఉద్దేశించి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని అన్నారు.

Ravneet Singh: రాహుల్‌పై కేంద్ర మంత్రి టెర్రరిస్టు వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ (Ravneet Singh Bittu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను 'నెంబర్ వన్ టెర్రరిస్ట్'గా పేర్కొన్నారు. సిక్కు వర్గాలను ఉద్దేశించి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ, రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని అన్నారు.


''రాహుల్ గాంధీ ఇండియన్ కాదు. ఆయన ఎక్కువ సమయం బయటే గడిపారు. ఆయనకు ఈ దేశంపై ఏమాత్రం ప్రేమ లేదు. అందువల్లే విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారతదేశాన్ని వక్రీకరించి మాట్లాడుతుంటారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను మోస్ట్ వాటెండ్ పీపుల్, వేర్పాటువాదులు, బాంబులు-తుపాకులు-బుల్లెట్ల తయారీ నిపుణులు మాత్రమే అభినందిస్తుంటారు. వాళ్లు కూడా రాహుల్ మాట్లాడినట్టే మాట్లాడతారు. అలాంటి వ్యక్తులు రాహుల్‌కు మద్దతు తెలుపుతున్నారంటే దేశంలో నెంబర్ వన్ టెర్రరిస్టు ఆయనే అవుతారు'' అని బిట్టూ విమర్శించారు.

Jharkhand: విపక్షాలపై ప్రధాని మోదీ విసుర్లు


దేశానికి అతిపెద్ద శత్రువు

విమానాలు, రైళ్లు, రోడ్డు పేల్చేసేందుకు కుట్రలు పన్నే ఈ దేశ శత్రువులే రాహుల్ గాంధీకి మద్దతిస్తుంటారని బిట్టూ విమర్శించారు. దేశానికి అతిపెద్ద శత్రువును పట్టుకునేందుకు రివార్డంటూ ఏదైనా ఉంటే ఆ వ్యక్తి రాహుల్ గాంధీయేనని తన అభిప్రాయమని చెప్పారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని బిట్టూ విడిచిపెట్టి బీజేపీలో చేరారు.


కాంగ్రెస్ ఫైర్..

రాహుల్ గాంధీని నెంబర్ వన్ టెర్రరిస్టుతో పోలుస్తూ కేంద్ర మంత్రి బిట్టూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇలాంటి వ్యక్తులను చూస్తే జాలి కలుగుతుందని, కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాహుల్‌గాంధీపై ప్రశంసలు కురిపించి, ఇప్పుడు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి విధేయుత చాటుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ ఆక్షేపణ తెలిపారు.


రాహుల్ ఏమన్నారు?

వర్జీనియాలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో సిక్కుల గురించి రాహుల్ మాట్లాడుతూ ''సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా లేదా అనే దానిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించినది'' అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఢిల్లీలోని రాహుల్ ఇంటిముందు ఆందోళన సైతం చేపట్టింది.


For MoreNational NewsandTelugu News

Updated Date - Sep 15 , 2024 | 08:46 PM