Share News

Sunita Kejriwal: సీఎం కేజ్రీవాల్ సతీమణి తీవ్ర అసంతృప్తి.. ఎందుకంటే..?

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:21 PM

ఈ రోజు ముఖ్యమంత్రి నివాసంలో జాతీయ జెండా ఎగురవేయలేదన్నారు. ఇది చాలా విచారకరమని పేర్కొన్నారు. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఈ నియంతృత్వం.. జైల్లో అయితే ఉంచగలిగింది. కానీ హృదయంలో దేశభక్తిని అది ఎలా కలిగి ఉంటుందన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా సునీత కేజ్రీవాల్ స్పందించారు.

Sunita Kejriwal: సీఎం కేజ్రీవాల్ సతీమణి తీవ్ర అసంతృప్తి.. ఎందుకంటే..?

న్యూఢిల్లీ, ఆగస్ట్ 15: స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో త్రివర్ణ పతాకం ఎగుర వేయకపోవడం పట్ల ఆయన భార్య సునీత కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి నివాసంలో జాతీయ జెండా ఎగురవేయలేదన్నారు. ఇది చాలా విచారకరమని పేర్కొన్నారు. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఈ నియంతృత్వం.. జైల్లో అయితే ఉంచగలిగింది. కానీ హృదయంలో దేశభక్తిని అది ఎలా కలిగి ఉంటుందన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా సునీత కేజ్రీవాల్ స్పందించారు.

Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతం వేళ.. ఏ రంగు చీర కట్టుకోవాలంటే..


స్పందించిన అతిషి..

ఈ అంశంపై ఢిల్లీ విద్యా, నీటి శాఖల మంత్రి అతిషి సైతం స్పందించారు. ఎన్నికైన ముఖ్యమంత్రిని తప్పుడు ఆరోపణలతో కొన్ని మాసాలుగా జైల్లో బంధించారన్నారు. ఇది ఏ ఒక్కరు ఊహించని పరిణామమని తెలిపారు. ఈ నియంతృత్వంపై తుది శ్వాస వరకు పోరాడతామని ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రతిజ్జ చేయాలని ప్రజలకు మంత్రి అతిషి పిలుపు నిచ్చారు.

Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఇదే..


ఈ ఏడాది మార్చి 21వ తేదీన..

ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన తీహాడ్ జైల్లోనే ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల వేళ.. ఎన్నికల ప్రచారం కోసం కొద్ది రోజులపాటు ఆయన మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ ఎన్నికల ప్రచారం ముగియగానే.. ఆయన మళ్లీ జైల్లోకి వెళ్లిపోయారు.


నాటి నుంచి తీహాడ్ జైల్లోనే.. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు..

నాటి నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహాడ్ జైల్లోనే ఉన్నారు. మరోవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మోదీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందంటూ ఆప్ నేతలు ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఢిల్లీలోని ప్రభుత్వాన్ని అస్థిరతకు గురి చేసేందుకు ఓ అజెండాతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆరోపణలు సైతం గుప్పిస్తున్నాయి. ఇక అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరిచింది. అలాగే కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ 23వ తేదీన స్పందించాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది.


ఆగస్ట్ 9వ తేదీన మనీశ్ సిసోడియా బెయిల్‌పై విడుదల..

ఇక ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఆగస్ట్ 9వ తేదీన సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 17 నెలల అనంతరం మనీశ్ సిసోడియా తీహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో త్వరలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విడుదలవుతారని ఆయన ఆకాంక్షించిన సంగతి తెలిసిందే.


త్రివర్ణ పతాకం ఎగరవేసే బాధ్యతను కైలాశ్ గెహ్లాట్‌కు అప్పగించి ఢిల్లీ ఎల్జీ..

ఇంకోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహాడ్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. మంత్రి అతిషి త్రివర్ణ పతాకం ఎగురవేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి కె సక్సెనాకు లేఖ రాశారు. దీనిపై ఢిల్లీ ఎల్జీ స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. త్రివర్ణ పతాకాన్ని ఆప్ నేత, హోం శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ఎగురవేయాలని ఆదేశించిన విషయం విధితమే.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 15 , 2024 | 05:18 PM