Share News

Sidda Raghava Rao: నో చెప్పిన చంద్రబాబు.. శిద్దా భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ABN , Publish Date - Jun 17 , 2024 | 07:52 PM

శిద్దా రాఘవరావు.. వైసీపీకి (YSRCP) రాజీనామా చేశారు సరే.. టీడీపీలోకి (TDP) ఎంట్రీ లేదని కూడా క్లియర్ కట్‌గా సందేశం వచ్చేసింది..! ఇప్పుడీ సీనియర్ నేత భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎన్నో కలలు కన్న శిద్దా (Sidda Raghava Rao) పరిస్థితి ఇప్పుడేంటి..?

Sidda Raghava Rao: నో చెప్పిన చంద్రబాబు.. శిద్దా భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

శిద్దా రాఘవరావు.. వైసీపీకి (YSRCP) రాజీనామా చేశారు సరే.. టీడీపీలోకి (TDP) ఎంట్రీ లేదని కూడా క్లియర్ కట్‌గా సందేశం వచ్చేసింది..! ఇప్పుడీ సీనియర్ నేత భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎన్నో కలలు కన్న శిద్దా (Sidda Raghava Rao) పరిస్థితి ఇప్పుడేంటి..? ఆయన నమ్ముకున్న కార్యకర్తలు, వీరాభిమానులు, అనుచరుల సంగతేంటి..? ఇప్పుడివే ప్రశ్నలు ఆయన్ను వెంటాడుతున్నాయి. నాడు అనవసరంగా టీడీపీ నుంచి బయటికి వచ్చానా..? నేడు ఆవేశపడి రాజీనామా చేశానా..? అని ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.


Sidda-YSRCP.jpg

ఏం జరుగుతోంది..?

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒంగోలు ఎంపీగా పోటీచేసిన శిద్దా.. ఓటమిపాలయ్యారు. వైసీపీ 151 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో వెంటనే వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పేసుకున్నారు. వ్యాపారవేత్త కావడం, కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం నాడు పార్టీలో చేరినప్పటికీ ఎలాంటి ప్రాధాన్యత లేదు. 2024 ఎన్నికల్లో తప్పకుండా దర్శి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని శిద్ధా ఎంతో ఆశపడ్డారు. అద్దంకి, ఒంగోలు ఎంపీగా, మార్కాపురం స్థానాల్లో ఏదో చోట నుంచి పోటీచేయాలని హైకమాండ్ ఆదేశించినా.. దర్శి కావాల్సిందేనని పట్టుబట్టారు. కుదరదని పెద్దలు చెప్పడంతో శిద్దా ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. దర్శీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ టికెట్ దక్కింది. దీంతో శిద్ధా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా.. దర్శీ నుంచి బూచేపల్లి 2456 ఓట్ల మెజార్టీతో గెలవడంతో ఇక వైసీపీలో ఉన్నా ప్రయోజనమేంటి..? అని అనుకున్నారో ఏమోగానీ పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు.

Sidda-And-Chandrababu.jpg


వాట్ నెక్స్ట్..?

రాజీనామా చేసిన వెంటనే టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. అబ్బే అస్సలు తీసుకోమంటే తీసుకోమని సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు క్లియర్ కట్‌గా తేల్చి చెప్పేశారట. దీంతో ఉన్న వైసీపీ పాయె.. వెళ్దామనుకున్న టీడీపీ పాయె ఏం చేయాలో దిక్కుతోచక అయోమయంలో పడ్డారట. ఎందుకు ఎంట్రీ లేదన్న విషయానికొస్తే.. గ్రానైట్ వ్యాపారం చేసే శిద్దా.. 1999లో టీడీపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. 2006లో శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా, 2007లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీటీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో దర్శీ నుంచి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచిన శిద్ధాను.. సీనియార్టీ, పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా కూడా బాధ్యతలు కట్టబెట్టారు. ఇంత ప్రియారిటీ ఇచ్చినా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే వైసీపీలో చేరడంతో శిద్ధాపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీలోకి వస్తానన్నా సరే తీసుకోబోమని చంద్రబాబు, లోకేష్ తేల్చి చెప్పేశారు. ఇటు వైసీపీకి రాజీనామా చేసి.. అటు టీడీపీలోకి తీసుకోక ఇప్పుడు శిద్ధా ఏం చేస్తారు..? భవిష్యత్ కార్యాచరణ ఏంటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పోనీ.. బీజేపీ లేదా జనసేనలోకి వెళ్లే చాన్స్ ఉందా అంటే.. చంద్రబాబును కాదని ఆ రెండు పార్టీలూ తీసుకునే ప్రసక్తే లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫైనల్‌గా శిద్దా ఏం చేయబోతున్నారో..? అడుగులు ఎటువైపు పడతాయో.. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Sidda-And-Jagan.jpg

శిద్దా.. టీడీపీలోకి ఎంట్రీ లేదు

Updated Date - Jun 17 , 2024 | 08:00 PM