Share News

Rohirat: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ ఆందోళన అక్కర్లేదు

ABN , Publish Date - Jul 01 , 2024 | 01:41 PM

భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ని సొంతం చేసుకుందని ఆనందించేలోపే.. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బాంబులు పేల్చారు. ఇదే తమ చివరి టీ20I వరల్డ్‌కప్ అంటూ..

Rohirat: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ ఆందోళన అక్కర్లేదు
Virat Kohli And Rohit Sharma

భారత జట్టు టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టైటిల్‌ని సొంతం చేసుకుందని ఆనందించేలోపే.. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బాంబులు పేల్చారు. ఇదే తమ చివరి టీ20I వరల్డ్‌కప్ అంటూ.. పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో.. ఆ ఇద్దరి అభిమానుల గుండె పగిలినంత పనైంది. అంత త్వరగా వీడ్కోలు పలకాల్సిన అవసరం ఏముందంటూ.. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వారిని ఓ భయం కూడా వెంటాడింది. వరల్డ్‌కప్ గెలిచిన ఆనందంలో ఆ ఇద్దరు ఇతర ఫార్మాట్‌లకి కూడా గుడ్‌బై చెప్తారేమోనని ఆందోళన చుట్టుముట్టింది.


అయితే.. అలాంటి భయాందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జైషా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం టీ20 వరల్డ్‌కప్ లాంటి జట్టునే ఏర్పాటు చేస్తున్నామని.. అందులో సీనియర్ ఆటగాళ్లు (రోహిత్, కోహ్లీ) కూడా ఉంటారని పేర్కొన్నారు. ‘‘భారత జట్టు అన్ని టైటిల్స్ గెలవాలని కోరుకుంటున్నాను. భారత జట్టు ఎలాగైతే పురోగమిస్తోందో.. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్స్ నెగ్గాలని భావిస్తున్నాను. భారత్ తదుపరి లక్ష్యాలు ఆ రెండు ట్రోఫీలే. టీ20 వరల్డ్‌కప్ లాంటి జట్టునే వాటి కోసం సిద్ధం చేస్తున్నాం. అందులో సీనియర్ ఆటగాళ్లూ ఉంటారు’’ అని జైషా చెప్పుకొచ్చారు.


ఇదిలావుండగా.. రోహిత్, కోహ్లీ కేవలం అంతర్జాతీయ టీ20కే వీడ్కోలు పలికారు. కాబట్టి.. వీళ్లిద్దరు ఇంకొన్నాళ్లు వన్డే, టెస్ట్ ఫార్మాట్‌ మ్యాచ్‌లు ఆడుతారు. క్రీడా వర్గాల సమాచారం ప్రకారం.. రాబోయే వన్డే వరల్డ్‌కప్ వరకు ఈ ఇద్దరు ఆటగాళ్లు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే నిజమైతే.. మరో నాలుగేళ్ల పాటు వాళ్లు భారత జట్టుకి తమ సేవలు అందిస్తారని అనుకోవచ్చు. మరోవైపు.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. అయితే.. ఈ జట్టులో దాదాపు యువ ఆటగాళ్లే ఉన్నారు. ఈ జట్టుకి శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. జులై 6వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 01 , 2024 | 01:41 PM