ఇళ్ళ కూల్చివేత కక్ష సాధింపు చర్య
ABN , Publish Date - Sep 21 , 2024 | 10:24 PM
తమ పార్టీకి చెందిన నేతల ఇళ్ళను కూల్చివేయడం కక్ష సాధింపులో భాగమేనని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. నస్పూర్ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివాకర్ రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అధికార యంత్రాంగం అత్యుత్సహం ప్రదర్శిస్తుందన్నారు.
నస్పూర్, సెప్టెంబరు 21 : తమ పార్టీకి చెందిన నేతల ఇళ్ళను కూల్చివేయడం కక్ష సాధింపులో భాగమేనని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. నస్పూర్ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివాకర్ రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అధికార యంత్రాంగం అత్యుత్సహం ప్రదర్శిస్తుందన్నారు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదని గుర్తుంచుకుని పనులు చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ కబ్జాల్లో ఉన్న వారందరికి ఇళ్ల పట్టాలను ఇప్పిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే కక్ష సాధింపుతో ఇళ్ళను కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించి ఖండించాలన్నారు. ఇన్నాళ్ళుగా ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడి, భయందోళనలు రేకేత్తించి కాంగ్రెస్ నాయకులు సొమ్ము చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళుతామని దివాకర్రావు వెల్లడించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన విధంగా గుణపాఠం చెప్పుతారన్నారు. నస్పూర్ కాలనీలో అల్లుడి ఇంట్లో ఉంటున్న బాధితుడు డికొండ అన్నయ్య కుటుంబ సభ్యులను దివాకర్రావు పరామర్శించారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, మాజీ సర్పంచు జక్కుల రాజేశం, నాయకులు రఫీక్ ఖాన్, ఎర్రన్న, జనార్దన్, రవిగౌడ్, గుమ్మడి శ్రీనివాస్, తిప్పని తిరుపతి, హైమద్ పాల్గొన్నారు.
దళితుడిని అయినందుకే కూల్చివేశారు...
దళితవర్గానికి చెందిన నాయకుడిని అయినందునే అధికారులు దౌర్జన్యంగా ఇంటిని కూల్చివేశారని టీబీజీకేఎస్ మాజీ నేత, బాధితుడు డికొండ అన్నయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. నస్పూర్ ప్రెస్క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ భూమి కబ్జా చేయలేదని, పొనగంటి ప్రేమలత భర్త గోపాల్రావు వద్ద 2019లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. గజం పది వేల చొప్పున సర్వే నంబరు 40/2లో 350 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్ చేయించుకున్నానని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగం నుంచి దిగిపోయిన తర్వాత ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీకి దరఖాస్తు చేస్తే అనుమతులు వచ్చినట్లు తెలిపారు. అనుమతులు ఇచ్చిన అధికారులే దౌర్జన్యంగా ఇంటిని కూల్చివేశారన్నారు. ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండానే ఇంటిలోకి వచ్చి దౌర్జన్యం చేశారన్నారు. కుటుంబసభ్యులను పోలీసులు, అధికారులు బంధించారన్నారు. కనీసం సామానులు తీసుకునేందుకు సమయం ఇవ్వ లేదని ఆవేదన చెందారు. 30 తులాల బంగారం, రూ.20 లక్షల నగదు కనిపించకుండా పోయాయని, విలువైన సామ గ్రి, ఫర్నిచర్ కోల్పోయామన్నారు. కొడుకు, కోడలు వైద్య విద్యకు చెందిన ధ్రువపత్రాలు, మెడికల్ సామగ్రి అందులోనే ఉండిపోయాయన్నారు. సుమారు మూడు కోట్ల ఆస్తి నష్టం జరిగిందన్నారు. కోర్టులో కేసు, స్టే ఆర్డర్ ఉన్నా కూడా కక్ష కట్టి కూల్చివేశారన్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని డికొండ అన్నయ్య తెలిపారు. సమావేశంలో డాక్టర్ డికొండ నవీన్ కుమార్, అల్లుళ్ళు రాజ్ కుమార్, అనిల్ కుమార్లు పాల్గొన్నారు.