పోటెత్తిన గోదావరి
ABN , Publish Date - Sep 02 , 2024 | 10:48 PM
భారీ వర్షాల కారణంగా జిల్లా కేంధ్రంలోని రాళ్లవాగు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో వాగు నీరు నదిలో చేరే అవకాశం లేక పోటు కమ్ముతోంది. దీంతో లోతట్టు ప్రాం తాలైన ఎన్టీఆర్ నగర్లోని 20 ఇళ్లలోకి నీరు చేరింది. వరద బాధితులను అధికారులు ఎన్టీఆర్నగర్ సమీపంలోని భవన నిర్మాణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రానికి తరలించారు.
మంచిర్యాల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి జిల్లాలోని పలు గ్రామాలు, కాలనీల్లోకి వరద నీరు చేరింది. దండేపల్లి మండలంలో 10.8 సెంటిమీ టర్లు వర్షపాతం నమోదుకాగా బెల్లంపల్లి మండలంలో 9.2 సెం.మీ, జన్నారం మండలంలో 8.8 సెం.మీ, చెన్నూరు మండలంలో 7.1 సెం.మీ వర్షం కురిసింది.
గోదావరి ఉగ్రరూపం...
ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. మంచిర్యాల వద్ద పుష్కరఘాట్ పూర్తిగా మునిగిపోయింది. గౌతమేశ్వరాల యం సమీపంలోకి వరద నీరు చేరింది. పాత మంచిర్యాలలోని శ్మశాన వాటిక నీట మునిగింది. గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో అంత్యక్రి యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నది ఒడ్డున ఉన్న ప్రైవేటు శ్మశాన వాటిక కూడా పూర్తిగా నీట మునిగింది. దీంతో నదికి వెళ్లే దారిలో రోడ్డు పక్కనే దహన సంస్కారాలు నిర్వహించాల్సి వస్తోంది. యేటా గోదావరి ఉప్పొంగినప్పుడల్లా అంత్యక్రియలకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
రాళ్లవాగు బ్యాక్ వాటర్తో మునిగిన ఇళ్లు
భారీ వర్షాల కారణంగా జిల్లా కేంధ్రంలోని రాళ్లవాగు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో వాగు నీరు నదిలో చేరే అవకాశం లేక పోటు కమ్ముతోంది. దీంతో లోతట్టు ప్రాం తాలైన ఎన్టీఆర్ నగర్లోని 20 ఇళ్లలోకి నీరు చేరింది. వరద బాధితులను అధికారులు ఎన్టీఆర్నగర్ సమీపంలోని భవన నిర్మాణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రానికి తరలించారు. కౌన్సిలర్ బదావత్ ప్రకాశ్నాయక్ నేతృత్వంలో పునరావాస కేంద్రంలో బాధితులకు ఆహారం, తాగునీరు, ఇతర ఏర్పాట్లు చేశారు. రాళ్లవాగు ఉప్పొంగడంతో ఆదిత్య ఎన్క్లేవ్ కాలనీ సమీపంలోకి నీరు చేరింది. పరిస్థితి ఇలాగే ఉంటే గతేడాది మాదిరిగా కాలనీ మొత్తం నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది. దీంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పాత మంచి ర్యాల లక్ష్మీనగర్ కాలనీలోని లోతట్టు ఇళ్లకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. రాళ్లవాగు బ్యాక్ వాటర్ ప్రస్తుతం ఇళ్ల సమీపంలోకి చేరింది. బైపాస్ రోడ్డు సమీపంలోని కాజువే వంతెన నీట మునిగింది. దీంతో రం గంపేట, పవర్సిటీ కాలనీ వాసులకు వాగు ఇవతలి వైపునకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ ఎన్టీఆర్ వరద ప్రాంతాలను సందర్శించి అధికారులను అప్రమత్తం చేశారు.
ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరాంపూర్, మంద మర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్లలోని ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోగా, ఓబీ మట్టి తొలగింపు పనులకు ఆటంకం ఏర్ప డుతోంది. మూడు ఏరియాల్లోని శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణాపూర్, మందమర్రి, గోలేటి, కైరిగూడ ఓసీపీల్లో దాదాపు రూ. 19.5 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా, రూ.6 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత పనులు నిలిచిపోయాయి.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 2,78,326 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతం 145.69 మీటర్ల ఎత్తుకు నీళ్లు చేరుకున్నాయి. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకుగాను ప్రస్తుతం 14.181 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో 32 గేట్లను ఒక మీటర్ ఎత్తు వరకు తెరిచి 4,02,023 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు.