Share News

అసైన్డ్‌ లెక్క.... ఇక పక్కా..

ABN , Publish Date - Sep 22 , 2024 | 10:40 PM

ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో అసైన్డ్‌ భూముల గుర్తింపు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల్లో ఎక్కడ అసైన్డ్‌ భూములు ప్లాట్లుగా మార్చారు..? అందులో ఎన్ని అన్యాక్రాంతమ య్యాయి..? అనే అంశాలపై స్పష్టత రానుంది. ఇదే సమయంలో అసైన్డ్‌ భూముల లెక్క ఇక పక్కాగా నమోదు కానుంది.

అసైన్డ్‌ లెక్క.... ఇక పక్కా..

మంచిర్యాల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో అసైన్డ్‌ భూముల గుర్తింపు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల్లో ఎక్కడ అసైన్డ్‌ భూములు ప్లాట్లుగా మార్చారు..? అందులో ఎన్ని అన్యాక్రాంతమ య్యాయి..? అనే అంశాలపై స్పష్టత రానుంది. ఇదే సమయంలో అసైన్డ్‌ భూముల లెక్క ఇక పక్కాగా నమోదు కానుంది.

ధరణి రాకతో....

ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత కబ్జాదారులు కోట్లాది రూపాయల విలువైన అసైన్డ్‌ భూములను కాజేసి వెంచర్లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా విక్రయించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులు చేసుకున్న ప్లాట్ల యజమానుల్లో చాలా మందివి ఇలాగే ఉన్నాయి. ఒకసారి అవి రెగ్యులరైజ్‌ అయితే శాశ్వతంగా వారి సొంతమైనట్లే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తులు మున్సిపాలిటీల వద్ద పెండింగులో ఉండగా, ఒక్క మంచిర్యాల మున్సిపాలిటీలోనే 600 వీఎల్టీ (వేకేట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనకు ముగ్గురు అధికారులను నియమిం చారు. 2020 ఆగస్టు 26వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ అయి ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికే అవకాశం కల్పించింది. ఆ తేదీ తరువాత అనధికార లే అవుట్లకు, ప్లాట్లకు అనుమతులు జారీ కావు.

అసైన్డ్‌ భూములపై సర్కారు దృష్టి

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేటప్పుడు అసైన్డ్‌ భూములపైన ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఆమోదానికి క్షేత్రస్థాయిలో జరిపే పరిశీలనలో మున్సిపల్‌ అధికారులతోపాటు రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు భాగస్వా మ్యం కల్పించింది. గతంలో మున్సిపాలిటీ అధికారులు, లేదంటే వారి కిందిస్థాయి సిబ్బంది మాత్రమే పరిశీలన జరిపేవారు. మున్సిపాలిటీ వద్ద ఉన్న అరకొర రికార్డుల వల్ల కొన్నిసార్లు అసైన్డ్‌ స్థలాలు సైతం రెగ్యులరైజ్‌ అయిన ఉదంతాలున్నాయి. దీనికి తోడు కొందరు మున్సిపల్‌ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది అసైన్డ్‌ భూములు అని తేలినా ముడుపులకు ఆశ పడి రెగ్యులర్‌ చేసిన దాఖలాలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలనలో మున్సిపల్‌ శాఖతోపాటు రెవెన్యూ, నీటి పారుదల శాఖలను భాగస్వాములను చేస్తోంది.

ఇక గుర్తింపు తేలిక

మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది గతంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించేవారు. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను మూడు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. మున్సిపల్‌ ప్రణాళిక విభాగం సూపర్‌వైజర్‌తోపాటు నీటి పారుదల శాఖ ఏఈ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తారు. అసైన్డ్‌ లేదా ప్రైవేటు స్థలామా అనేది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ గుర్తిస్తారు. చెరువులు, కుంటలు, వాగులు, నాలాల నుంచి ఎంత దూరంలో ఉంది అనేది నీటి పారుదల శాఖ ఏఈ పర్యవేక్షిస్తారు. ఆ స్థలం నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాం తమా అనేది పట్టణ ప్రణాళిక విభాగం సూపర్‌వైజర్‌ గుర్తిస్తారు. తద్వారా అసైన్డ్‌ భూమిని గుర్తించడం తేలిక కానుంది. వీరు ముగ్గురు అమోదించాకే ఎల్‌1 లాగిన్‌ నుంచి పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ఎల్‌2 లాగిన్‌కు దరఖాస్తు పంపిస్తారు. అక్కడి నుంచి ఎల్‌3 లాగిన్‌ పర్య వేక్షించే మున్సిపల్‌ కమిషనర్‌కు వెళుతుంది. రుసుం చెల్లించాక కమిషనర్‌ ఆమోదంతో ఎస్‌ఆర్‌ఎస్‌ పత్రం జారీ చేస్తారు. పెద్ద లే అవుట్‌ల క్రమ బద్ధీకరణ రికార్డులను ఎల్‌4 దశలో భాగంగా కలెక్టర్ల పరిశీలనకు పంపాల్సి ఉంటుంది.

ఎన్‌వోసీల కోసం

ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్‌ భూముల్లో ప్లాట్లు వెలిశాయి. 1966 కంటే ముందు ప్రభుత్వం అసైన్డ్‌ చేసిన భూములకు ఎన్‌ఓసీ (నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు)లు జారీ అయ్యాయి. దాన్ని అవకాశంగా మలచుకొని కొందరు ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలుపెట్టారు. ఇదే అదునుగా కొందరు నకిలీ ఎన్‌వోసీలు సృష్టించి భూములను విక్రయిం చారు. ఎస్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో జత చేసిన ఎన్‌వోసీలు ఏవీ నకిలీవో గుర్తించం కష్టంగా మారింది. ఫలితంగా చాలా దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. కొత్త మార్గదర్శకాలతో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో వేగం పెరుగనున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమార్కుల్లో గుబులు

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రధానంగా అసైన్డ్‌ భూములపై దృష్టి పెట్టనుండడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్లాట్లు కొన్నవారు కలవర పడుతున్నారు. గతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పేదల నుంచి అసైన్డ్‌ భూములను తక్కువ ధరల కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాటు చేసి విక్రయించారు. అందులో ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా క్రమబద్దీకర ణకు దరఖాస్తు చేసుకున్న వారు క్షేత్రస్థాయి పరిశీలనలో అవి అసైన్డ్‌ భూములని తేలితే ఎక్కడ తమను నిలదీస్తారోనన్న భయం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను వెంటాడుతోంది. ఇప్పటికే చాలా మంది తమ ఇంటి స్థలం ఎలాంటి వివాదంలోనైనా చిక్కుకుని ఉందా అనే విషయమై ఆరా తీస్తున్నారు.

Updated Date - Sep 22 , 2024 | 10:40 PM