ఎడతెరపిలేని వర్షం...
ABN , Publish Date - Sep 01 , 2024 | 10:38 PM
రెండు రోజు లుగా కురుస్తున్న వర్షం కారణంగా జిల్లాలో జనజీవనానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు, వంకల్లో నీరు చేరగా గోదావరి, ప్రాణహిత నదులు పొంగి పొర్లు తున్నాయి. వర్షం కొనసాగనుండటంతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
మంచిర్యాల, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రెండు రోజు లుగా కురుస్తున్న వర్షం కారణంగా జిల్లాలో జనజీవనానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు, వంకల్లో నీరు చేరగా గోదావరి, ప్రాణహిత నదులు పొంగి పొర్లు తున్నాయి. వర్షం కొనసాగనుండటంతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. వరుసగా కురు స్తున్న వర్షాల కారణంగా ప్రభుత్వం సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలకు జిల్లా కేం ద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో వీధుల్లోకి నీరు చేరి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బృందావనం కాలనీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాళ్లవాగుకు భారీ వరద తాకిడి కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద...
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద తాడికి పెరుగుతోంది. ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరడంతో నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 1,29,453 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 148 మీటర్లకుగాను ప్రస్తుతం 147.29 మీటర్ల ఎత్తుకు నీళ్లు చేరుకున్నాయి. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.202 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో సాయంత్రం 6 గంటల వరకు 20 గేట్లను ఒక మీటర్ ఎత్తు వరకు తెరిచి 1,44,714 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదు లుతున్నారు. దీంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గోదావరి జలకళను సంతరించుకుంది. జిల్లా కేంద్రంలోని పుష్కర ఘాట్ సమీపంలోకి వరద నీరు చేరింది. గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్నగర్, ఎల్ఐసీ కాలనీ, రాం నగర్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు కొనసాగుతుండటంతో రాత్రి వరకు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్తోపాటు మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు అత్యవసర సమయాల్లో 9849044106 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు.
జిల్లాలో 6.9 సెం.మీ వర్షపాతం నమోదు
జిల్లాలోని చెన్నూరు మండలంలో ఆదివారం 6.9 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, జైపూర్ మండలంలో 6.0 సెం.మీ, బెల్లంపల్లి మండలంలో 5.2 సెం.మీ, కోటపల్లి మండలంలో 4.1 సెం.మీ, కాసిపేట మండలం కొండాపూ ర్లో 3.8 సెం.మీ, నస్పూర్ మండలంలో 3.7 సెం.మీ, మం దమర్రి మండలంలో 3.6 సెం.మీ, జిల్లా కేంద్రంతోపాటు జన్నారం మండలంలో 2.9 సెం.మీ చొప్పున వర్షం కురిసింది.
ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
వర్షాల కారణంగా జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్లలోని ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోగా, ఓబీ మట్టి తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడుతోంది. మూడు ఏరియాల్లోని శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణాపూర్, మందమర్రి, గోలేటి, కైరిగూడ ఓసీపీల్లో దాదాపు రూ. 13 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా, రూ.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత పనులు నిలిచిపోయాయి.