Share News

వాహన టెండర్లు జరిగేనా?

ABN , Publish Date - Sep 26 , 2024 | 10:47 PM

జిల్లాలో ధాన్యం రవాణా చేసే లారీల టెండర్లు ఈసారైనా జరిగేనా అనే సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. ప్రతిసారీ ధాన్యం రవాణాకు లారీలకు టెండర్లు ఆహ్వానించడం అనంతరం నేరుగా పనులు అప్పగించడం జిల్లాలో కొన్నాళ్లుగా ఆనవాయి తీగా వస్తోంది.

వాహన టెండర్లు జరిగేనా?

మంచిర్యాల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం రవాణా చేసే లారీల టెండర్లు ఈసారైనా జరిగేనా అనే సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. ప్రతిసారీ ధాన్యం రవాణాకు లారీలకు టెండర్లు ఆహ్వానించడం అనంతరం నేరుగా పనులు అప్పగించడం జిల్లాలో కొన్నాళ్లుగా ఆనవాయి తీగా వస్తోంది. అయితే నిబంధనల మేరకు టెండర్ల ద్వారానే కాంట్రా క్టర్లను ఎంపిక చేయాలనే డిమాండ్‌లు సర్వత్రా వినిపిస్తున్నాయి. అధికా రులు ఈసారి టెండర్‌ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించడం ద్వారా అర్హులకు పనులు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ధాన్యం తరలింపునకు....

జిల్లాలో వానాకాలం, యాసంగి (2024-25) సీజన్లలో సేకరించే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు, అక్కడ బియ్యంగా మారిన తరువాత తిరిగి మండల లెవల్‌ స్టాకిస్టు పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్‌ షాపులకు సరుకును తరలించాల్సి ఉంటుంది. ఇందుకు లారీలు అవసరం కావడంతో ఆసక్తిగలవారి నుంచి జిల్లా పౌర సరఫరాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. అధికారులు ఆగస్టు 23న ఈ ప్రొక్యూర్‌ మెంట్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌ టెండర్లను ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 40 లారీలు అవసరం ఉండగా, ఈ నెల 17వ తేదీ వరకు గడువు ముగిసే సమయానికి తొమ్మిది ఏజెన్సీల నుంచి టెండర్లు దాఖలయ్యాయి. టెండర్లను ఓపెన్‌ చేసి, కోట్‌ తక్కువ చేసిన ఏజెన్సీకి టెండర్లు అప్పగించాల్సి ఉంటుంది. అయితే జిల్లా వ్యాప్తంగా నాలుగు సెక్టార్లు ఉండగా, సెక్టార్‌ 1, 2 రెండింట్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

లారీల కొరతతో ఇబ్బందులు

జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం సరఫరా చేసేందుకు 423 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటికి నెలకు సగటున 100 క్విం టాళ్ల వరకు బియ్యం అవసరం ఉంటుంది. ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దుకాణాల్లో డీలర్లు బియ్యం ఇవ్వాల్సి ఉండగా, లారీల కొరత కారణంగా సరుకు ఆలస్యంగా అందుతోంది. దీంతో బియ్యం ఎప్పుడు పోస్తారో తెలియని పరిస్థితుల్లో లబ్ధిదారులు షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండేవారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చినా పూర్తిగా గాడిలో పడలేదనే చెప్పాలి. జిల్లాలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ షాపులకు తరలించేందుకు 40 లారీలు అవస రం ఉంటాయి. మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు ఆరు లారీలు విధిగా కేటాయించాలి. గత సంవత్సరం స్టేజ్‌-2 కాంట్రాక్టర్‌ కేవలం రెండు లారీలు నడపడంతో సమయానికి బియ్యం సరఫరా సక్రమంగా జరుగ లేదు. స్టేజ్‌-1 కాంట్రాక్టర్‌ మిల్లుల నుంచి బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయిం ట్లకు తరలించడంతో అక్కడి నుంచి నేరుగా స్టేజ్‌-2 కాంట్రాక్టర్‌ అవే లారీలతో షాపులకు తరలించే ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా స్టేజ్‌-2 కాంట్రాక్టర్‌కు నాలుగు లారీలు ఆదా కాగా, ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడ్డారు.

టెండర్లకు పోటాపోటీ

జిల్లాలో ఈసారి లక్షా 16వేల ఎకరాల నుంచి మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించేందుకు దూరాన్ని బట్టి ప్రభుత్వం లారీ అద్దె చెల్లిస్తోంది. ఈ సొమ్ము పెద్ద మొత్తంలో ఉండడంతో పోటాపోటీగా టెండర్లు దాఖలయ్యాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో తూకం పూర్తయ్యాక రైస్‌మిల్లులకు ధాన్యం తరలించేందుకు రైతుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తుండడం కూడా లారీ యజమానుల్లో పోటీకి మరో కారణంగా తెలుస్తోంది. జిల్లాలో సెక్టార్‌-1, 2 కింద లక్షెట్టిపేట, మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉండగా వాటిలో టెండర్ల నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్‌ అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సెక్టార్లకు సంబంధించి ఒక్కో కాంట్రాక్టర్‌ ఎంపిక దాదాపుగా పూర్తికాగా హైద్రాబాద్‌లోని పౌర సరఫరాలశాఖ ప్రధాన కార్యాలయానికి కూడా పంపినట్లు సమాచారం. ఆన్‌లైన్‌ టెండర్లు ఆహ్వానించినందున నిబంధనల మేరకే కాంట్రాక్టర్లను ఎంపిక చేయాలని లారీల యజమానులు కోరుతున్నారు.

Updated Date - Sep 26 , 2024 | 10:47 PM