Share News

Bowinapally : అనుమానం పెనుభూతమై..

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:37 AM

భార్యపై అనుమానం.. ఆపై ఆర్థిక ఇబ్బందులతో సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో ఓ భర్త భార్యను, ఉయ్యాలలో నిద్రిస్తున్న తన 11 నెలల కన్న కూతురిని ప్లాస్టిక్‌ వైర్‌తో ఉరేసి చంపి.. ఆపై తానూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Bowinapally : అనుమానం పెనుభూతమై..

  • భార్యను, చంటిబిడ్డను హతమార్చిన భర్త.. ఆపై ఆత్మహత్య

బోయిన్‌పల్లి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానం.. ఆపై ఆర్థిక ఇబ్బందులతో సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో ఓ భర్త భార్యను, ఉయ్యాలలో నిద్రిస్తున్న తన 11 నెలల కన్న కూతురిని ప్లాస్టిక్‌ వైర్‌తో ఉరేసి చంపి.. ఆపై తానూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర నాందేడ్‌ డెగ్లూర్‌కు చెందిన గణేశ్‌ సంగ్రామ్‌ కొలనూరె(34) తన భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు త్రివేణి(6), తనుశ్రీ(4)తో కలిసి రెండున్నర సంవత్సరాల క్రితం సికింద్రాబాద్‌కు వచ్చి బోయిన్‌పల్లిలోని ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నాడు. గణేశ్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

11 నెలల క్రితం వారికి నక్షత్ర అనే పాప జన్మించింది. నక్షత్ర విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారు జామున అందరూ నిద్రిస్తున్న సమయంలో భార్య స్వప్నతో పాటు పసికందు నక్షత్రను ప్లాస్టిక్‌ కేబుల్‌ వైరుతో దారుణంగా హత్యచేశాడు. అనంతరం బోయిన్‌పల్లిలో ఉన్న రైలుపట్టాల వద్దకు వెళ్లి పోలీసులకు ఫోన్‌చేసి తాను తన భార్య, కూతురిని హత్య చేశానని తెలిపాడు.

వారు వివరాలు అడిగేలోపే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి అటుగా వస్తున్న ఓ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెంటనే గణేశ్‌ ఇంటికి వెళ్లి చూడగా అతని భార్యతోపాటు 11 నెలల చిన్నారి నక్షత్ర చనిపోయి కనిపించారు. స్వప్న, చిన్నారి మృతదేహాలతో పాటు గణేశ్‌ మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనాథలైన గణేశ్‌, స్వప్న దంపతుల మరో ఇద్దరు కూతుళ్లు త్రివేణి, తనుశ్రీని వారి బంధువులకు అప్పగించారు.

Updated Date - Jul 22 , 2024 | 03:37 AM