Share News

Miyapur: బాలుడిని చంపి పీక్కుతిన్నాయి..!!

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:18 AM

వీధి కుక్కల దాడికి మరో పసిప్రాణం బలైంది. హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు.. ఆ చిన్నారిని చంపి శరీర భాగాలను పీక్కుతిన్నాయి. ఈ హృదయవిదారక ఘటన మియాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి మక్తాలో బుధవారం ఉదయం వెలుగు చూసింది.

Miyapur: బాలుడిని చంపి పీక్కుతిన్నాయి..!!

  • మియాపూర్‌ డంపింగ్‌ యార్డులో దారుణం

  • వీధి కుక్కల దాడి.. ఆరేళ్ల బాలుడి మృతి

మియాపూర్‌/హైదరాబాద్‌ సిటీ, జూన్‌5(ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల దాడికి మరో పసిప్రాణం బలైంది. హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు.. ఆ చిన్నారిని చంపి శరీర భాగాలను పీక్కుతిన్నాయి. ఈ హృదయవిదారక ఘటన మియాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి మక్తాలో బుధవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మియాపూర్‌ మక్తామహబూబ్‌పేటకు చెందిన సురేష్‌, శిరీష దంపతులకు సాత్విక్‌(6) అనే కుమారుడు ఉన్నాడు. శిరీష రెండేళ్ల క్రితం మరణించగా కొడుకు సాత్విక్‌, తల్లి దేవమ్మతో కలిసి సురేష్‌ నివాసముంటున్నాడు. సురేష్‌ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా దేవమ్మ భిక్షాటన చేస్తుంటోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న సాత్విక్‌ వేసవి సెలవులు కావడంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. సురేష్‌ ఉదయాన్నే పనికి వెళ్లిన తర్వాత సాత్విక్‌ను మక్తా వెనక ఉండే చెత్తకార్మికుల పిల్లల వద్ద వదిలేసి దేవమ్మ భిక్షాటనకు వెళుతుంటోంది.


సాత్విక్‌, ఇతర చిన్నారులు అక్కడి డంపింగ్‌ యార్డ్‌ పరిసరాల్లో ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దేవమ్మ సాత్విక్‌ను తిరిగి తీసుకొస్తోంది. అయితే, రోజులాగే మంగళవారం సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన దేవమ్మకు సాత్విక్‌ జాడ తెలియలేదు. కొడుకు సురే్‌షతో కలిసి చుట్టుపక్కల గాలించినా ఫలితం దక్కలేదు. అయితే, బుధవారం ఉదయం స్థానిక డంపింగ్‌ యార్డులో చెత్తను వేసేందుకు వచ్చిన కార్మికులు నిర్మానుష్య ప్రదేశంలో ఓ బాలుడిని మృతదేహాన్ని చూశారు. స్థానికుడే కావడంతో అది సాత్విక్‌ మృతదేహంగా గుర్తించిన చెత్త కార్మికులు విషయాన్ని దేవమ్మ, సురే్‌షతోపాటు పోలీసులకు తెలియజేశారు సాత్విక్‌ శరీరంపై కుక్కల పంటి గాట్లు ఉండగా పొట్ట చీలి పేగులు బయటకి వచ్చాయి. ఆ గాయాలు, ఘటనా స్థలంలో పరిస్థితులు ఆధారంగా కుక్కల దాడిలో సాత్విక్‌ మరణించినట్టు నిర్ధారణకు వచ్చారు.


బాలుడిపై కుక్కల దాడి.. తీవ్ర గాయాలు

చిట్యాల:ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని భీష్మనగర్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. భీష్మనగర్‌కు చెందిన స్వరూప, సంపత్‌ దంపతుల కుమారు డు శివ ఆడుకుంటుండగా రెండు వీధి కుక్కలు దాడిచేశాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Updated Date - Jun 06 , 2024 | 03:18 AM