Share News

CM Revanth: గ్రూప్ 1 పరీక్షలు ఆగవు.. బీఆర్ఎస్ ఉచ్చులో పడకండని సీఎం రేవంత్ సూచన

ABN , Publish Date - Oct 19 , 2024 | 07:27 PM

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లపాటు ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేసిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఇప్పుడేమో పోటీ పరీక్షలను వాయిదా వేయాలని అంటోందని అన్నారు.

CM Revanth: గ్రూప్ 1 పరీక్షలు ఆగవు.. బీఆర్ఎస్ ఉచ్చులో పడకండని సీఎం రేవంత్ సూచన

హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లపాటు ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేసిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఇప్పుడేమో పోటీ పరీక్షలను వాయిదా వేయాలని అంటోందని అన్నారు. పోలీసు డ్యూటీ మీట్ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి యథాతథంగా జరుగుతాయని CM రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'పరీక్షలకు సిద్ధం కండి. 95శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మరో 5శాతం మంది డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మకండి. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మేం వచ్చాకే వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం' రేవంత్ పేర్కొన్నారు.


అండగా నేనున్నా..

"తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. పదేళ్లుగా వాయిదాలు పడుతున్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేశాం. 15 వేల మంది పోలీస్ సిబ్బందిని కొత్తగా నియమించాం.1,637 ఇంజినీరింగ్ పోస్టులు, 65 రోజుల్లోనే 11,067 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం. నిరుద్యోగుల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు. 564 గ్రూప్ వన్ పోస్టుల నియామకాల కోసం మెయిన్స్ పరీక్షను సోమవారం నిర్వహించబోతున్నం. ప్రతిపక్షాల ఉద్యోగాలు పోయాయి. వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. గతంలో ఉన్న జీఓ 55 రద్దుచేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చాం. అదే సమయంలోనే జీఓ 29 తెచ్చాం. ఈ జీవో ద్వారా రిజర్వేషన్లు ఖాళీల భర్తీ విషయంలో ఒక పోస్టు ఖాళీగా ఉన్న 1:50 పిలవాలని నిర్ణయించాం. 31 వేల మందికి పైగా మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇప్పుడు 1:100 లెక్కన పిలవాలి అని ఆందోళన చేస్తున్నారు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనలను మధ్యలో మారిస్తే కోర్టులు ఊరుకుంటాయా? నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే 1:100 కోరుకుని ఉంటే మీ ఆలోచనకు తగ్గట్టే ఇచ్చేవాళ్లం.


రిజర్వేషన్ ప్రకారమే సెలెక్ట్ చేస్తే వేలమంది ఎస్సీ, ఎస్టీలకు అవకాశం వచ్చింది. రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేస్తుంటే కొంతమంది గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం మీకు అపాయింట్మెంట్ అయినా ఇచ్చారా..? ప్రజా యుద్ధనౌక గద్దర్ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే నాలుగు గంటలపాటు ఎండలో నిల్చోబెట్టిన నీచమైన చరిత్ర వాళ్లది. గ్రూప్ 1 హాల్ టికెట్లు 95 శాతం మంది తీసుకున్నారు.. ఇంకా తీసుకొని వారు హాల్ టికెట్లు తీసుకొని పరీక్షకు సన్నద్ధంకండి. న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని సమర్థించాయి. మీ భావోద్వేగాలతో బీఆర్ఎస్ ఆడుకుంటోంది. వారి ఉచ్చులో పడకండి. ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. అన్నగా నేను పరీక్షలు నిర్వహిస్తుంటే, వద్దు అని ఆందోళన చేస్తున్నారు ఆలోచించండి. మీకు అవకాశాలు ఇవ్వడం కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆందోళనలను విరమించి అపోహాలకు దూరం కండి. నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నప్పుడు ఉదారంగా వ్యవహరించండి. నిరుద్యోగులపై కేసులు పెట్టాల్సిన అవసరం లేదు.. పొరపాటున కేసులు పెడితే ఉద్యోగాలు సాధించడంలో ప్రతిబంధకంగా మారుతాయి. నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న క్రమంలో కేసులు పెట్టవద్దని పోలీసులను ఆదేశిస్తున్నా" అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Secunderabad: నిర్మానుష్యంగా సికింద్రాబాద్.. కొనసాగుతున్న బంద్

ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..

TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..

TG News: ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో సహించలేని ఓ యువకుడు ఏం చేశాడంటే

Updated Date - Oct 19 , 2024 | 07:40 PM