Local Body Elections: సిద్ధం కండి!
ABN , Publish Date - Jul 27 , 2024 | 02:58 AM
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని, ముందుగా నిర్దేశించిన ప్రకారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గడువులోగా బీసీ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
కోటాపై గడువులోగా బీసీ కమిషన్ నివేదికివ్వాలి
అధికారులకు సీఎం నిర్దేశం స్థానికానికి సిద్ధంకండి!
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని, ముందుగా నిర్దేశించిన ప్రకారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గడువులోగా బీసీ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సచివాలయంలో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఎదురయ్యే ఆటంకాలు, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలన్న దానిపై చర్చించారు.
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) నూతన ఓటర్ల జాబితా రావాల్సి ఉందని, ఇప్పటికే రెండు రాష్ట్రాలకు పంపిందని, తెలంగాణతోపాటు మరో ఆరు రాష్ట్రాలకు వారంలో పంపనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. దాంతో, ఓటరు జాబితా రాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని, వారంలోపే ఆయా స్థానిక సంస్థలకు తగినట్లు ఓటర్ల జాబితాలు రూపొందించాలని నిర్దేశించారు.