Share News

Yadadri-Bhuvanagiri: గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం.. నకిలీ ధ్రువపత్రాల తయారీ

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:13 AM

మతం మారిన వారికి త్వరితగతిన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలయ్యేలా నకిలీ ధ్రువపత్రాలను తయారు చేసే ముఠా ఆటను యాదాద్రి-భువనగిరి జిల్లా పోలీసులు కట్టించారు.

Yadadri-Bhuvanagiri: గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం.. నకిలీ ధ్రువపత్రాల తయారీ

  • ముఠా గుట్టు రట్టు.. ఇద్దరి అరెస్టు

  • పరారీలో మరో ఇద్దరు నిందితులు

భువనగిరి టౌన్‌, ఆగస్టు 14: మతం మారిన వారికి త్వరితగతిన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలయ్యేలా నకిలీ ధ్రువపత్రాలను తయారు చేసే ముఠా ఆటను యాదాద్రి-భువనగిరి జిల్లా పోలీసులు కట్టించారు. ఇందులో ఇద్దరు అరెస్టవ్వగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. భువనగిరిలోని సమద్‌ చౌరస్తాకు చెందిన సుందర్‌ గణేశ్‌ 2008లో ఇస్లాం మతంలోకి మారాడు. ఆ తర్వాత తన పేరును అబ్దుల్లాగా మార్చుకున్నాడు. ఆ వివరాలతో కేంద్రప్రభుత్వం గెజిట్‌ కోసం ప్రయత్నించాడు.


8 ఏళ్ల తర్వాత అతని పేరిట గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ క్రమంలో అతనికి ఇలాగే మతం మారిన హైదరాబాద్‌ అక్బర్‌బాగ్‌ నివాసి నజీర్‌ అలియాస్‌ నర్సింగ్‌రావు, ఢిల్లీకి చెందిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఏజెంట్‌ భరత్‌గుప్తా పరిచయం అయ్యారు. భువనగిరిలో ఏ-టు-జడ్‌ పేరుతో ఆన్‌లైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన అబ్దుల్లా.. తనలా మతం మారిన వారు గెజిట్‌ నోటిఫికేషన్‌ పొందేందుకు ఎక్కువ కాలం వేచిచూడకుండా.. నకిలీ పత్రాల దందా మొదలుపెట్టాడు. అలా.. నకిలీ పాన్‌కార్డు, ఓటర్‌ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వక్ఫ్‌బోర్డు సర్టిఫికెట్‌లను తయారు చేయడం ప్రారంభించాడు.


కార్తీక్‌ బుక్‌ బైండింగ్‌ అండ్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకుడు మరికుక్కల గిరిబాబును తన ముఠాలో చేర్చుకుని, అతనితో నకిలీ రబ్బర్‌ స్టాంపులను తయారు చేయించేవాడు. నోటరీ అడ్వొకేట్‌ ద్వారా ఓ ఆంగ్ల పత్రికలో నోటిఫికేషన్లు వేయించేవాడు. ఢిల్లీలో ఉన్న ఏజెంట్‌ భరత్‌గుప్తా సాయంతో.. గెజిట్‌ నోటిఫికేషన్‌ వెంటనే వచ్చే లా చర్యలు తీసుకునేవాడు. ఒక్కో గెజిట్‌ నోటిఫికేషన్‌కు భరత్‌గుప్తా రూ.1,700 తీసుకునేవాడు. ఈ క్రమంలో అబ్దుల్లా నకిలీ ధ్రువపత్రాలు ఇస్తున్నట్లు గుర్తించిన భరత్‌గుప్తా.. తన రేటును రూ.5 వేలకు పెంచాడు.


అబ్దుల్లా భువనగిరిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. అదుపులోకి తీసుకుని విచారించగా.. నకిలీ ధ్రువపత్రాల ముఠా డొంక కదిలిందని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేశారు. ఆ తర్వాత గిరిబాబును అరెస్టు చేశారు. వీరిద్దరూ చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉండగా.. నజీర్‌, భరత్‌గుప్తా పరారీలో ఉన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 04:13 AM